కామారెడ్డి, మార్చి 23 : రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2014 జూన్ 2 రాష్ట్రం ఏర్పడే వరకు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న వారిని ఆదు కునేందుకు ప్రభుత్వం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ జీవోను అమలు పరిచిందని పేర్కొన్నారు. ఎక్కువ మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకోలేదన్నారు.
తాను సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో 2020 వరకు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్న నిరుపేదలు ఏప్రిల్ 30లోగా ఆన్లైన్ ద్వారా ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 240 మంది దరఖాస్తులు చే సుకోగా 233 మందికి పట్టాలు వచ్చినట్లు తెలిపారు. ఇద్దరు ప్రైవేట్ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవించడంతో వారికి వర్తించలేదని చెప్పారు. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నారు. జీవో నెంబర్ 59 ప్రకారం వారు ఆన్లైన్ దరఖాస్తు చే సుకుంటే మార్కెట్ ధర ప్రకారం స్థలాన్ని కొనుగో లు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.కలెక్టర్ జితేశ్ పాటిల్, రాష్ట్ర ఉర్దూ అ కాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు విజయభాస్కర్ గౌడ్, అంజల్ రెడ్డి, కన్నయ్య, రాజు, నాయకులు ప్రసన్నకుమార్, అధికారులు పాల్గొన్నారు.