పది మంది ఖాతాల్లో రూ.10 లక్షల జమ
ఖలీల్వాడి, మే 30 : కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం’ సోమవారం ప్రారంభించారు. ఈ పథకం కింద నిజామాబాద్ జిల్లాలో అర్హులైన పది మంది బాధిత బాలలకు స్థానిక అధికారులు ఆర్థిక ప్రయోజనానికి సంబంధించిన బాండ్లను కలెక్టరేట్లోని ఎన్ఐసీ కార్యాలయంలో అందజేశారు. వీరిలో ఆరుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. వీరికి ఉపకార వేతనాలు, పీఎం కేర్స్ పాస్పుస్తకాలు, ఆయుష్మాన్ వైద్యబీమా కార్డు ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు.
పిల్లల పేరిట వారి ఖాతాలో రూ.10 లక్షలు జమ చేశారు. వారికి 23 సంవత్సరాల వయస్సు నిండిన అనంతరం ఏక మొత్తంగా దానిని అందించనున్నారు. అప్పటివరకు డిపాజిట్ మీద వచ్చే వడ్డీని వారికి చదువు, ఇతర అవసరాల కోసం సమకూర్చనున్నారు. ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం’ను ప్రధాని మోదీ సోమవారం లాంఛనంగా ప్రారంభించగా, ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వీసీలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి ఝాన్సీ, డీఆర్డీవో చందర్, డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్రావు, బాలసంరక్షణ విభాగం అధికారి చైతన్య కులకర్ణి పాల్గొన్నారు.