కామారెడ్డి, ఏప్రిల్ 17 : మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమేటి కిష్టయ్య ఫంక్షన్ హాల్లో 12, 20, 21, 22, 23, 24, 43 వార్డులకు చెందిన ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ తోఫాలను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్తో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.
బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలకు పేదలకు కానుకలను అందజేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, వర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. పండుగలను సంప్రదాయబద్ధంగా, సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ముస్లిములు రంజాన్ పండుగను సోదరభావంతో జరుపుకోవాలన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. నిష్టతో ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి వెల్లివిరియాలని కోరారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ పెద్ద మనుసుతో పేద ముస్లింలకు దుస్తులు అందజేయడం అభినందనీయమన్నారు.
అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఇస్తూ మత సామరస్యానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ హఫీజ్, నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.