కామారెడ్డి రూరల్, మే 4 : అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. పంట నష్టపోయిన ప్రతిరైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం లింగాయిపల్లి, కోటల్పల్లి, నర్సన్నపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ విప్ గురువారం పరిశీలించారు. పొలాలకు వెళ్లడానికి సరైన దారి లేకపోవడంతో బైక్పై పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. నష్టపోయిన ప్రతిరైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అన్నదాతలెవరూ అధైర్యపడవద్దని సూచించారు. ప్రభుత్వ విప్ వెంట జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపిగౌడ్, వ్యవసాయాధికారులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
ప్రభుత్వ విప్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఆరెపల్లి సర్పంచ్
రాజంపేట్, మే 4: మండలంలోని ఆరెపల్లి గ్రామ సర్పంచ్ కొమ్ము యాదగిరి గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజంపేట సొసైటీ చైర్మన్ నల్లవెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.