వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలకు పూజలు చేద్దామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతినబూనారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు రసాయనాలు వినియోగించి తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని నినదించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తాము తయారు చేసిన విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐదేండ్లుగా సాగిస్తున్న ఈ మహాయజ్ఞంపై ప్రత్యేక కథనం..
మట్టి వినాయకుడి ప్రతిమ ఏర్పాటుతో పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతామంటున్నారు నిజాంసాగర్ మండలంలోని కొమలంచ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఐదేండ్లుగా పాఠశాలలో మట్టి వినాయకుని విగ్రహాలను అందంగా తయారు చేసి గ్రామంలో ప్రతి ఇంటికీ అందజేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుని విగ్రహాలను తయారు చేసి ప్రతి ఇంటికీ అందించేందుకు నిమగ్నమయ్యారు. విద్యార్థులు అందజేస్తున్న మట్టి గణపతులను ఉపయోగిస్తున్న గ్రామస్తులు.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతున్నారు. ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణలో విద్యార్థులంతా కలిసి సుమారు 500 వరకు వినాయకుని విగ్రహాలను తయారు చేసి ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నారు. విద్యార్థులు తయారు చేసిన మట్టి గణపతులను పూజిస్తామంటూ గ్రామస్తులు సైతం సంతోషంగా తీసుకువెళ్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం చేస్తున్న ఈ మహత్కార్యానికి గ్రామస్తులతోపాటు తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
మా ఊరి బడిలో పిల్లలు తయారు చేసిన మట్టి గణపతులనే పూజిస్తున్నాం. గ్రామంలోని సుమా రు 500 కుటుంబాలకు విద్యార్థులు మట్టి గణపతులను అందజేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అందజేస్తే వాటినే పూజిస్తాం. పిల్లలు ఈ కార్యక్రమం ద్వారా మాకు మంచి సందేశాన్ని ఇస్తుండడంతో గ్రామంలో చాలా వరకు మార్పు వచ్చింది.
– గజవాడ బైరేశ్ కుమార్, గ్రామస్తుడు
విగ్రహాలకు వేసిన పెయింట్ ఎండే సమయంలో విడుదలయ్యే వాయువులు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. పెయింట్లలో రంగుల కోసం వాడే కణాల్లో సాధారణంగా కాడ్మియం లేదా టైటానియంలతో కూడిన పదార్థాలు ఉంటాయి. ఇవి విషపూరితమైనవే. ఆయా వాయువులు గాలిలో కలవడంతో వాయుకాలుష్యం జరిగి సకాలంలో వర్షాలు పడకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో చేసే, కృత్రిమ రంగులతో అలంకరించిన వినాయక విగ్రహాలతో దుష్ఫలితాలు అధికంగా ఉంటాయి. వీటిని చెరువుల్లో నిమజ్జనం చేయడంతో జలచరాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ నీటిని తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాలుష్యపరమైన ప్లాస్టిక్లతో కాకుండా మట్టిని వినియోగించుకోవడంతో పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుంది.
గ్రామంలో ఐదేండ్లుగా మట్టి వినాయకుడి విగ్రహాలను అందజేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామంలోని మట్టిని తీసుకువచ్చి విద్యార్థులతో తయారు చేయిస్తున్నాం. విద్యార్థులు పోటీ పడుతూ విగ్రహాలను అందంగా తయారుచేస్తున్నారు. వీటిని అందజేస్తుండడంతో గ్రామస్తులు ప్రతి పండుగకు వీటికే పూజలు చేస్తూ చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. మేము అందజేసిన వినాయకుడి విగ్రహాలనే పూజిస్తుండడంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
– శ్రీరాం, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు
ఐదేండ్ల నుంచి మట్టివిగ్రహాలకు ఆదరణ పెరుగుతున్నది. పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్ధల వారు ప్రతి ఏడాది ప్రజలకు ఇంట్లో పూజించుకునే విగ్రహాలను ఉచితంగా ఇస్తుంటారు. దీంతో గతంలో కన్నా మట్టి వినాయకులకు ఆదరణ పెరుగుతున్నది. పరిసరాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయనే భావనతో నవరాత్రుల్లో మట్టి వినాయకులనే పూజించాలనే స్పృహ ప్రజల్లో కలుగుతున్నది.
మండలంలోని కొమలంచ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులతోపాటు అందులో చదువుకుంటున్న విద్యార్థులు ఐదేండ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో రహదారులపై చెత్తాచెదారం వేయకుండా, ఇంట్లోని చెత్త బుట్టలోనే చెత్త వేసి ప్రతి రోజు పంచాయతీ ట్రాక్టర్లో వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. తాగునీటి నల్లాల వద్ద పారిశుద్ధ్యం లోపించకుండా ప్రజలకు సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చైతన్యం తెస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను పూజించేలా కృషి చేస్తున్నారు.