జగిత్యాల, జూలై 28 : అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తర్వాత ఏటా లక్ష చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రెవెన్యూ కార్యాలయాల్లో తొలగించిన 600 మంది కంప్యూటర్ ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ఎన్నికల ముందు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను సంవత్సర కాలంలో భర్తీ చేస్తామని, అనంతరం ఏర్పడే ఖాళీలన్నీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భర్తీ చేస్తామని, జాబ్క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో ఉన్న కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రాధాన్యత క్రమంలో శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లకుపైగా గడిచినా ఇంతవరకు ఏ వాగ్దానం అమలు చేయలేదని మండిపడ్డారు. కనీసం రాజీవ్ యువ వికాసం లాంటి కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధికి సంబంధించి ఏ ఒకరికి కూడా అవకాశం కల్పించలేదన్నారు. దశాబ్దకాలానికిపైగా రెవెన్యూ కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ఉపాధి పొందుతున్న దాదాపు 600కుపైగా కంప్యూటర్ ఆపరేటర్లను ఏ కారణం లేకుండా విధుల నుంచి తొలగించారని ఆగ్రహించారు. దీని వల్ల రాష్ట్ర స్థాయిలో 600కుపైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. ప్రభుత్వం నిరుపేదలకు, ప్రత్యేకంగా యువతకు అండగా నిలుస్తుందని భావిస్తే.. నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
నిరుద్యోగ యువత పూర్తిగా నిరాశ, నిసృ్పహలకు లోనవుతున్నదని ఆవేదన చెందారు. దశాబ్ద కాలం నుంచి రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఏకపక్షంగా తొలగించడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు అద్దం పడుతుందన్నారు. తక్షణమే ఉద్యోగాల భర్తీ చేపట్టడంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అలాగే రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని, రెవెన్యూ కార్యాలయాల్లో తొలగించిన 600కుపైగా కంప్యూటర్ ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.