రెంజల్, డిసెంబర్ 2 : భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. దివ్యాంగ పిల్లలకు చికిత్స, సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో విద్యా బోధన, ఆట పాటలతో పాటు ఇస్తున్న శిక్షణ సత్ఫలితాలను ఇస్తున్నది. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. జిల్లాలో బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల పరిధిలో 19 మండలాల్లో భవిత కేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2022 సంవత్సరంలో భవిత కేంద్రాల్లో 1412 మంది పిల్లలను చేర్పించారు. ప్రస్తుతం వీరిలో శిక్షణ పూర్తి చేసుకున్న 1060 మంది పిల్లలు వివిధ పాఠశాలల్లో ప్రవేశం పొందారు. మిగతా 352 మంది పిల్లలు భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.350 రవాణా భత్యం చెల్లిస్తున్నది. చెవిటి, మూగ, అంధ విద్యార్థుల జీవితాల్లో భవిత కేంద్రాలు అత్మైస్థెర్యాన్ని నింపుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ కేంద్రాలకు పంపించేందుకు చిన్నారుల తల్లి దండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు వినికిడి లోపం, అంగవైకల్యం, దృష్టి లోపం, గ్రహణ మొర్రి, మాటలు రాని చిన్నారులు భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. సమస్యను ప్రాథమిక స్థాయిలో గుర్తించి దశలవారీగా శిక్షణ ఇస్తున్నారు. వినికిడి లోపం, మాటలు రాని పిల్లలకు పరికరాలను అమర్చడంతో పాటు స్పీచ్ థెరపీ చేయిస్తున్నారు. చిన్నారులతో రాయించడం, పాటలు పాడించడం, బొమ్మలు గీయించడం వంటి అంశాలను చేయిస్తూ వారి ప్రతిభను వెలికి తీస్తున్నారు. ఫిజియోథెరఫీ ద్వారా చిన్నారులకు అవయవ లోపాలు ఉంటే శిక్షణ ఇస్తున్నారు. అంధులకు బ్రెయిలీ లిపిపై అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులు చిన్నారుల మానసిక స్థితికి అనుగుణంగా విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు.
ప్రభుత్వం కల్పించే ప్రతి సదుపాయాలను చిన్నారులకు చేరేలా చర్యలు తీసుకుంటు న్నాం. భవిత కేంద్రా ల్లో నెలలో నాలుగు సార్లు ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహిస్తుండడంతో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 0-18 సంవత్సరాలోపు గల పిల్లల తల్లిదండ్రులు భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
-వనిత, జిల్లా ప్రత్యేక అవసరాల పిల్లల సమన్వయ కర్త