కోటగిరి, డిసెంబర్ 28 : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 56లక్షల వ్యయం తో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులు, రూ. 16 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ, రూ.9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ, రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ మాదిగ కమ్యూనిటీ భవనాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి నూతన భవనాలను, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నదని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందిస్తున్నదని గుర్తుచేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. విద్యతోపాటు వైద్యం, వ్యవసాయం, రోడ్లు తదితర రంగాల అభివృద్ధిలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మీవీర్రాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సర్పంచ్ గంగమ్మ, సహకార సంఘం అధ్యక్షుడు కనకారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వీర్రాజు, కల్లాలి గిరి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు జమ చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు హుమ్నాపూర్ గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్పీకర్ తనయుడు రవీందర్రెడ్డి జన్మదినం సందర్భంగా సభాపతితో కేక్కట్ చేయించి గ్రామస్తులకు పంచిపెట్టారు.