బాన్సువాడ, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే అని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో దివంగత పరిగె పాపమ్మ, రాజిరెడ్డి దంపతుల జ్ఞాపకార్థం మూడురోజులుగా నిర్వహించిన ప్రో కబడ్డీ టోర్నీ ఆదివారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి స్పీకర్ పోచారం హాజరయ్యారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాసరెడ్డి, టోర్నీ నిర్వాహకుడు, స్పీకర్ సోదరుడు పరిగె శంభురెడ్డితో కలిసి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులను పరిచయం చేసుకొన్నారు. అనంతరం బొల్లారం, పోలీసు ఫైటర్స్ జట్లు ఫైనల్కు చేరుకోగా.. పోటీలను స్పీకర్ ప్రారంభించి, వీక్షించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన ఆట కబడ్డీ అని తెలిపారు. విజయవంతంగా టోర్నీ నిర్వహించిన తన సోదరుడు శంభురెడ్డిని అభినందించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా బాన్సువాడ మినీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారని కితాబునిచ్చారు. తాను చదువుకునే రోజుల్లో పరీక్షలు ఉన్నా కబడ్డీ పోటీలకు వెళ్లి ఆడేవారమని గుర్తుచేసుకొన్నారు. జోష్, ఇనిస్పిరేషన్, ఇంట్రెస్ట్ ఉండే క్రీడ అంటేనే కబడ్డీ అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఉన్నా కబడ్డీపై మక్కువతో సమావేశాలను ముగించుకొని బాన్సువాడకు వచ్చినట్లు తెలిపారు.
ప్రో కబడ్డీ టోర్నీలో తన కుమారులు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సురేందర్రెడ్డి పాలు పంచుకున్నారని అన్నారు. బాన్సువాడ స్టేడియంలో క్రీడాకారుల కోసం కబడ్డీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ పోటీలకు మ్యాట్తోపాటు మూడు ఆర్చరీలను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటిని సీఎం కేసీఆర్ ఇచ్చిన స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ రూ. పది లక్షలతో సమకూరుస్తామన్నారు. ఈ పోటీలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గంప గోవర్ధన్ను ఆహ్వానించామని, అనివార్య కారణాలతో రాలేకపోయారని తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సా హం అందిస్తున్న స్టేడియం మేనేజర్ నరేశ్ను స్పీకర్ ఈ సందర్భంగా అభినందించారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
టోర్నీలో విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన పోలీసు ఫైటర్స్ జట్టుకు రూ.30 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన బొల్లారం జట్టుకు రూ.20 వేలు, తృతీయ, నాల్గో స్థానంలో నిలిచిన జట్లకు రూ.పదివేల చొప్పున నగదు పురస్కారాన్ని సభాపతి పోచారం అందజేశారు. ఉత్తమ రైడర్, డిఫెండర్, ఆల్రౌండర్కు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, భాస్కర్ రెడ్డి, మధుసూదన్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు నారాయణ రెడ్డి, సంగ్రాం నాయక్, మోహన్ నాయక్, మహ్మద్ ఏజాస్, బాబా, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఉత్కంఠగా సాగిన పోటీలు
మూడు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 24 జట్లు పాల్గొన్నాయి. 12 లీగ్, 6 నాకౌట్ , రెండు సెమిఫైనల్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు.