బాన్సువాడ, డిసెంబర్ 19 : సమైక్య పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చేపల ఉత్పత్తి పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పిస్తూ రాష్ట్రంలో నీలి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్య సంపదను సృష్టిస్తున్నది. మరో వైపు చేపల మార్కెటింగ్కు అవసరమైన వాహనాలను మత్స్య సమీకృత అభివృద్ధి పథకంలో 75 శాతం రాయితీపై అందిస్తూ వారి ఆర్థిక పరిపుష్టికి చేయూత అందిస్తున్నది.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాగునీటి రంగానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా ఉనికి కోల్పోయిన చెరువులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పూర్వవైభవం తీసుకొచ్చింది. దీంతో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులను ఆదుకోవడానికి 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. మత్స్య సమీకృత పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో చేపల వేటే ఆధారంగా జీవించే కుటుంబాలకు తెలంగాణ సర్కారు చేపలను రవాణా చేసుకునేందుకు 75 శాతం రాయితీపై వాహనాలను అందజేస్తున్నది.
కామారెడ్డి జిల్లాలో 2018-19 సంవత్సరంలో మత్స్యకారుల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీపై వివిధ రకాల రవాణా వాహనాలను అందజేసింది. 2400 టీవీఎస్ మోపెడ్లు, 11 సంచార వాహనాలు, 96 లగేజీ ఆటోలు, 350 మందికి చేపలు పట్టే వలలు, లైఫ్ జాకెట్లు, 460 ప్లాస్టిక్ క్రిట్స్, 38 మందికి చేపల రవాణా కోసం పోర్టబుల్ మొబైల్ కియోస్కు వాహనాలు, 4 ఇన్సులేటెడ్ ట్రక్కులు, 2 హైజనిక్ వాహనాలు 75 శాతం సబ్సిడీపై అందించింది. రెండు లాగుడు వలలను సమీకృత మత్స్యకారుల కుటుంబాలకు అందజేసింది.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతి కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తుంది. చేపల రవాణాకు 75 శాతం రాయితీపై వాహనాలను సైతం అందిస్తున్నది. మత్స్యకారులు ఆర్థికంగా అభ్యున్నతి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది.
కె.వరదారెడ్డి, కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ సమీకృత శాఖ అధికారి