జగిత్యాల, ఏప్రిల్ 30: ‘కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు తోడుదొంగలు. నకిలీ సెక్యులర్ జీవన్రెడ్డి, నకిలీ మతవాది అర్వింద్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువద్దని కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. ఇప్పుడూ కలిసే పనిచేస్తున్నాయి’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు అన్ని జీవన్రెడ్డికేనా..? కాంగ్రెస్లో వేరే నాయకులు లేరా..? అని ప్రశ్నించారు. ప్రతి పదవీ తనకే కావాలంటున్న జీవన్రెడ్డి.. మరీ ఆరు గ్యారెంటీల అమలు ఎక్కడిదాకా వచ్చిందో చెప్పాలన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో బాజిరెడ్డి మాట్లాడారు. అర్వింద్ గత ఎన్నికల్లో పసుపుబోర్డు తేస్తానని బాండు పేపర్ రాసిచ్చిండు. అట్లనే జీవన్రెడ్డి కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీతారామాలయం వద్ద బాండు పేపర్పై రాసి హనుమంతుడి మీద ప్రమాణం చేసిండు. పసుపుబోర్డు వచ్చిందీ లేదు. ఆరు గ్యారంటీలు అమలైంది లేదు.
ఎన్నికల కోసం బాండ్ పేపర్ రాసిచ్చే బాబులను ఓడించాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూకపెల్లిలోని 4వేల డబుల్బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులు కల్పించి, ఉగాది వరకు గృహప్రవేశాలు చేయిస్తామని లబ్ధిదారులకు జీవన్రెడ్డి హామీ ఇచ్చాడని, మరి వాటి పరిస్థితి ఏమిటో తెలువదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి గెలిచిందన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, రైతు రుణమాఫీ ఏమైందని జీవన్రెడ్డిని నిజామాబాద్ ప్రజలు నిలదీస్తున్నారన్నారు. తాను మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తిని అని, ఈ ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని చెప్పారు. నెలకు ఒకసారి జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి, ప్రశ్నించే గొంతుకను అవుతానని స్పష్టం చేశారు. పసుపు బోర్డు నోటిఫికేషన్ మాత్రం వచ్చిందని, ఏర్పాటు మాత్రం చేయలేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై సుప్రీం కోర్టులో కేసు వేసి సాధిస్తానన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.