ఖలీల్వాడి, నవంబర్ 30 : ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత లభించేలా చొరవ చూపాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఏ మేరకు ప్రాతినిధ్యం కల్పించారు, ఉద్యోగ ఖాళీల భర్తీలో ఎంతమంది దివ్యాంగులకు, అవకాశం కల్పించారు తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన దివ్యాంగులకు కోటాను అనుసరిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, సంక్షేమ పథకాల్లో నూటికి నూరు శాతం అవకాశం దక్కేలా అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. దీనిని సానుభూతిగా పరిగణించకూడదని, ప్రభుత్వం దివ్యాంగులకు కల్పించిన హక్కుగా గుర్తించి నిబంధనలను పక్కాగా అమలుచేయాలన్నారు. దళితబంధు పథకంతో పాటు అర్హులైన దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని ఆదేశించారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన దివ్యాంగులందరినీ ఓటరు జాబితాలో చేర్చి ఆధార్ అనుసంధానం ప్రక్రియను పూర్తి చేయించాలన్నారు. సెల్ కాన్ఫరెన్స్లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.