గతంలో భూమి హక్కు పత్రాలు పొందాలంటే అదో ప్రహసనం. ఎక్కడికక్కడ వేళ్లూనుకుపోయిన అవినీతితో పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అన్నదాతలు చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయిన సందర్భాలు ఎన్నో. కానీ రాష్ట్రంలో భూబదలాయింపు ఇక్కట్లను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ సేవలు అందుబాటులోకి తేవడంతో భూ సమస్యలకు తక్షణ పరిష్కారం దొరుకుతున్నది. జఠిలమైన భూసమస్యలు సైతం ఇట్టే పరిష్కారం అవుతున్నాయి. మండల స్థాయిలోనే నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూ సమస్యలు, భూకబ్జాలు, దొంగ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టబద్ధమైన సేవల ద్వారా వ్యవసాయదారుల ఇక్కట్లు పూర్తిగా తొలగిపోవడంతో ఆదరణ భారీగా ఉంటున్నది. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 86,644 దరఖాస్తులు రాగా 78,347 లావాదేవీలు పూర్తయ్యాయి. ధరణి డిజిటలైజేషన్ కావడంతో అవినీతికి చెక్ పడింది.
– నిజామాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఏండ్లుగా దున్నుకుంటున్న సొంత భూమికి హక్కు పత్రాలు దక్కాలంటే రైతులకు నరకం కనిపించేది. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్ వరకు అడిగినంత డబ్బులు చెల్లించలేక, వారిని సంతృప్తి పర్చలేక చతికిలబడేది. పైసలివ్వకపోతే చెప్పులు అరిగేలా తిరిగినా… కర్షకుల సమస్య పరిష్కారం అయ్యేది కాదు. పాత రెవెన్యూ వ్యవస్థలో అడుగడుగునా పాతుకుపోయిన అవినీతితో సామాన్యులు రోజూ బలయ్యేది. ఒకానొక దశలో రెవెన్యూ అధికారుల దొంగ చేష్టలకు తాళలేక ఆత్మహత్యాయత్నాలకు ప్రయత్నించిన వారెందరో ఉన్నారు. కర్షకుల కన్నీళ్లను అడుగడుగునా తీరుస్తోన్న తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా భూ బదలాయింపు ఇక్కట్లు తీర్చేందుకు సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ సేవలపై అద్భుత స్పందన వ్యక్తమవుతున్నది. నెలల తరబడి తిరిగినా పరిష్కారం కాని సమస్యకు కేవలం స్లాట్ బుకింగ్తో మండల స్థాయిలోనే నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూ సమస్యలు, భూకబ్జాలు, దొంగ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టబద్ధమైన సేవల ద్వారా వ్యవసాయదారుల ఇక్కట్లు పూర్తిగా తొలగిపోవడంతో ఆదరణ భారీగా ఉంటున్నది.
కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఉమ్మడి రాష్ట్రంలో భూ లావాదేవీలకు కచ్చితమైన ఫ్లాట్ఫాం లేకపోయేది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములకు హక్కులను మార్చుకోవాలంటే నరకం కనిపించేది. కార్యాలయాలు దోపిడీకి అడ్డా అన్నట్లుగా మారేది. అమాయక ప్రజలను ముగ్గులో దించి దళారులు, భూకబ్జాదారులు సైతం రిజిస్ట్రేషన్లో మోసాలకు పాల్పడేది. భూమిని ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్నా గతంలో హక్కు పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరిగేది. రైతులు కాళ్ల్లరిగేలా తిరిగినా పట్టించుకోక పోయేవారు. అమ్యామ్యాల రుచి మరిగిన అధికారులు కొర్రీలు పెట్టేవారు. విలువైన భూములకు ఎకరానికి రూ.లక్షల్లో దండుకున్న వాళ్లు లేకపోలేదు. చివరికి పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవడానికి వెళ్లినా డబ్బులివ్వాల్సిన దుస్థితి. ఇప్పుడలాంటి ఘాతుకాలకు అవకాశమే లేకుండా పోయింది. తహసీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో వ్యయ ప్రయాసాలు తగ్గాయి. మొత్తమ్మీద ప్రభుత్వం నిర్దేశించిన ధరకే పారదర్శకంగా భూ యాజమాన్య హక్కులు చట్టబద్దంగా మారుతున్నాయి. రైతుల ఇబ్బందులు తొలగించడంతోపాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన ధరణి సేవలు భూమి బదలాయించుకున్న వారందరినీ ఆకట్టుకుంటున్నది.
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా కోరుకున్న రోజునే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి చేసుకోవచ్చు. అత్యంత పారదర్శకంగా భూ బదలాయింపు ప్రక్రియ జరుగుతున్నది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. తహసీల్ కార్యాలయాల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పిం చాం. తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆయా మండలాల ప్రజలు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్, వారసత్వ భూ మార్పిడి వంటి పనులను ధరణి ద్వారా ప్రజలు పొందవచ్చు. ధరణి పోర్టల్ సేవలకు వ్యవసాయదారుల నుంచి మంచి స్పందన వస్తున్నది. పారదర్శకత పెరగడంతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
– చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, నిజామాబాద్
2020, అక్టోబర్ 29న ధరణి పోర్టల్ సేవలు అందుబాటులోకి రాగా ఇప్పటి వరకు వేలాది స్లాట్లు బుక్ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 86,644 స్లాట్లు 33 మండలాల్లో జరిగాయి. ఇందులో 78,347 లావాదేవీలు పూర్తయ్యాయి. ఈ మొత్తం లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి రూ.104.54 కోట్ల ఆదాయం సమకూరింది. తహసీల్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్తోపాటు, తహసీల్దార్/జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అందుబాటులో ఉంటారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయాల్లో రోజుకు గరిష్ఠంగా పది స్లాట్లకు అనుమతి ఇస్తున్నారు. ఇది వరకు రిజిస్ట్రేషన్ ఒక చోట, మ్యుటేషన్ ఒక చోట ఉండేది. దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం డిజిటల్ సంతకం పూర్తయిన భూముల వివరాలు పొందుపరిచారు. నిజామాబాద్ జిల్లాలో 3,15,928 వన్బీ ఖాతాల్లో భూములు నిక్షిప్తమై ఉన్నాయి. ఇందులో 2,58,685 వ్యవసాయ ఖాతాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2,73,770 వన్బీ ఖాతాలుండగా ఇందులో 2,59,745 వ్యవసాయ ఖాతాలున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. భూ క్రయ, విక్రయాలు జరగాలంటే దళారులను నమ్మి అనేక మంది మోసపోయేది. అమాయకులను ఆసరాగా చేసుకొని మధ్యవర్తులు ఇష్టానుసారంగా దోచుకునేది. లేనిపోని నిబంధనల పేరుతో భయానికి గురిచేసి డబ్బులు గుంజేది. గతమంతా ఓ పీడ కల కాగా… ప్రస్తుతం ధరణి ఓ అద్భుతమే.
ధర్పల్లి, మే 28 : పాణి నఖలు కావాలన్న, ఏదైనా సర్టిఫికేట్ మీద వీఆర్వో సార్ ది సంతకం కావాలన్న ఆల్ల చుట్టూ, తాసీలు ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుండే. గిప్పుడు జూస్తే గా బాధలేవి లేకుండా వోయినయి. సానా మంచిగైంది. ఓళ్లను బతిమిలాడాల్సిన పనిలేకుండా వోయింది. భూమి మార్చుకునే పని కోసం నా కొడుకు వోయి మీ సేవల ఆైప్లె చేసి అచ్చిండు. గీడ తాసీల్ ఆఫీసుల సంతకాలు చేస్తే అయిపోతదంటే వచ్చినం. రిజిస్ట్రేషన్లు గూడ గిడనే అయితున్నయంటే ఎంత మంచిగైందో అనిపిస్తుంది. గీ సౌలత్లైతే మాయసొంటి చేతగాని ముసలోల్లకు ఎంతో మంచిగా అయింది. అప్పట్ల భూములు కొన్నామంటే నిజాంబాద్కు పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుండే. -గూగ్లోత్ బిక్య, రైతు, ఇందిరానగర్ తండా
ధర్పల్లి, మే 28 : ఇటీవల మా తండ్రి చనిపోయినాడు. మా నాన్న పేరు మీద ఉన్న భూమిని మా పేరు మార్చు కునేందుకు(ఫౌతి) తహసీల్ కార్యాలయానికి వచ్చినం. ఆన్లైన్ అంతా ప్రాసెస్ చేసి ఎవరికీ ఎలాంటి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే పని అయిపోయింది. ఇదే ఒకప్పుడైతే వీఆర్వో, ఆర్ఐ అంటూ తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుండే. మీ సేవలో దరఖాస్తు చేసుకొని ఇక్కడికి వచ్చినం. ఒక్క రోజులోనే పని అయిపోతుదంటే చాలా అద్భుతమనిపిస్తుంది. రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. -బాదావత్ సంతోష్, రైతు, మరియ తండా
వేల్పూర్, మే 28: ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కోసం రోజంతా ఇబ్బంది పడేవాళ్లం. కేసీఆర్ సీఎం అయ్యాక తీసుకొచ్చిన ధరణి తో ఎంతో సంతోషంగా ఉన్నాం. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించే చలాన్ డబ్బులు తప్ప అదనంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పని అయిపోతుంది. కండ్ల ముందే రిజిస్ట్రేషన్ అయిపోవడమే కాకుండా కొత్తపాస్ బుక్ వస్తుంది. ఇంత కన్నా ఇంకా ఏం కావాలి. ఇటువంటి ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం సరైంది కాదు. ధరణి రద్దు అయితే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవు. -కొత్తింటి రాజన్న, కోమన్పల్లి
ఏర్గట్ల, మే 28: ధరణి వెబ్పోర్టల్ రైతుల భూములకు రక్షణగా ఉంటున్నది. ధరణి రాకముందు భూముల వివరాలు పుస్తకాల్లో చేతిరాతలతో ఉండేవి. పుస్తకాలు చినిగిపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ ధరణి వెబ్పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరి భూముల సమాచారం ఆన్లైన్లో ఉంటుంది.
– సంజీవ్ యాదవ్, రైతు,గుమ్మిర్యాల్
వేల్పూర్, మే 28: సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి వెబ్ పోర్టల్తో మా ఇబ్బందులు తొలగాయి. మేము ఇలా తహసీల్ కార్యాలయానికి వచ్చి పంట పొలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసుకొని అలా వెళ్లి పోతున్నాం. దీనిపై ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. ఇది సరి కాదు. ధరణితోనే రైతుల కష్టాలు తీరాయి.
-దోనికర రాజన్న, కోమన్పల్లి