ఇందూరు, జూలై 1 : ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఐదు రకాల మొక్కలతో వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జీపీ పరిధిలో ఐదు రకాల మొక్కలు కనీసం వెయ్యి నాటి పంచవనాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. నిర్ణీత విస్తీర్ణంలో చింత, జామ, మామిడి, వేప మొక్కలను ఒక్కోచోట రెండు వందల చొప్పున నాటాలన్నారు. మిగతా రెండు వందల మొక్కల్లో శ్రీగంధం, ఎర్రచందనం, వేరుమద్ది, నల్లమద్ది రకాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలన్నారు.
జిల్లాలో ఈసారి హరితహారం కింద 45 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం ఉండగా, 35 లక్షల పైచిలుకు మొక్కలను కాలువ గట్లపైనే నాటాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. కాలువల పరిధిలో గుర్తించిన స్థలాల్లో వివిధ అవసరాల కోసం జీపీలు వినియోగించుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. మిగితా స్థలాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. పల్లెప్రగతి పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా అందమైన పూలమొక్కలు నాటాలని, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలోనూ సోమవారం నుంచి ఈ పనులు ప్రారంభించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్వో సునీల్, డీఆర్డీవో చందర్, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.