ఆర్మూర్టౌన్, మార్చి25: పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల నుంచి విద్యుత్ ఉపకరణాలను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సోమవారం స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంతోపాటు పిప్రి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వ్యవసాయ క్షేత్రాల నుంచి స్టార్టర్ బాక్సులు, సబ్మెర్సిబుల్ పంపులు, ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగలతోపాటు పలు విద్యుత్ ఉపకరణాలను చోరీ చేస్తూ పట్టణంలోని వీక్లీ బజార్ సమీపంలోని వసీమ్(టిల్లిబాబా)కు విక్రయించేవారు. వసీమ్ పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేస్తుంటాడు. కాగా శనివారం రాత్రి పట్టణంలోని జై భవానీ ఆర్డర్ మెస్ ఆవరణలో ఉన్న సబ్మెర్సిబుల్ పంపు చోరీకి గురైంది. రాత్రి సుమారు 12గంటల సమయంలో సబ్మెర్సిబుల్ పంపును ఎత్తుకెళ్తుండగా నిందితులు ఆర్డర్ మెస్ యజమాని అనిల్ కంటపడ్డారు. అనిల్ ఆదివారం నిందితుల ఇంటికి వెళ్లి తన పంపుసెట్ను ఇవ్వాలని కోరాడు.
తాము వసీమ్కు విక్రయించామని నిందితులు తెలిపారు. పాత ఇనుప సామగ్రి షాపులో ఉందని దానిని ఇప్పిస్తామని అనిల్ను షాప్ దగ్గరికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పలువురు బాధిత రైతులు తాము పోగొట్టుకున్న సామగ్రి కోసం వసీమ్ షాపునకు వచ్చారు. వసీమ్కు సంబంధించిన ఇనుప సామగ్రిని, దుకాణాన్ని పోలీసుల సహాయంతో రైతులు తనిఖీ చేశారు. తనిఖీలో లక్షల రూపాయల విలువ గల విద్యుత్ ఉపకరణాలు, బ్యాటరీలు లభ్యమయ్యాయి. చోరీ సామగ్రిని కొనుగోలు చేస్తూ దొంగలను ప్రోత్సహిస్తున్న వసీమ్తోపాటు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తును పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రవి కుమార్ తెలిపారు.