గాంధారి, జనవరి 10 : కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామం పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది మహాభారతంలోని కౌరవుల తల్లి గాంధారి. భారతంలో ధృతరాష్ట్రుడి భార్యగా, కౌరవుల తల్లిగా గాంధారి పేరు అందరికీ తెలిసిందే. అయితే గాంధారి గ్రామానికి మహాభారతానికి ఎక్కడా సంబంధం లేదు. కానీ గాంధారి గ్రామానికి ఈ పేరు రావడానికి భారతానికి ఉన్నంత కథ దాగి ఉన్నది. చరిత్ర ప్రకారం గాంధారి పేరుతో ఇప్పటి వరకు ముగ్గురు మహిళామూర్తులు మాత్రమే ఉన్నారు. ఇందులో మొదటగా మహాభారతంలో కౌరవుల తల్లి గాంధారి, రెండోది జైన గణముల్లో సైతం గాంధారి పేరు ఉంది. మూడోది జానపద కథల ఆధారంగా తీసుకుంటే బాలరాజు అనే 12 రోజుల పసిబాలుడికి భార్యగా, మహా పతివ్రతగా పేరుగాంచిన గాంధారి.
పూర్వ కాలంలో (ప్రస్తుతం ఉన్న గాంధారి గ్రామాన్ని) దేవరపేట రాజ్యమును నరేంద్రుడు అనే రాజు పాలించేవాడు. ఈయన పాలనలో రాజ్యంలోని ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారు. కానీ రాజుకి సంతానం లేకపోవడంతో భార్య కొములంచ దేవీతో కలిసి నిత్యం బాధపడుతుండేవాడు. రాజుకు సిరిసంపదలు ఉన్నా సంతానం లేకపోవడంతో వారి జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది. ఒక రోజు వీరు సంతానం కోసం కులదైవమైన ఈశ్వరుడిని ప్రార్థించగా, ప్రత్యేక్షమైన పార్వతీపరమేశ్వర్లు రాజదంపతులకు పుత్రుడు జన్మిస్తాడని వరం ఇస్తారు. కానీ, ఆ బాలుడు 12 రోజుల కన్నా ఎక్కువ బ్రతకడని చెబుతారు. ఆ బాలుడు చిరంజీవి కావడానికి మార్గాన్ని చూపాలని దంపతులు స్వామివారిని వేడుకోగా 12 ఏండ్ల బాలికతో బాలుడికి వివాహం చేయాలని, ఆ బాలిక ప్రభావంతో బాలుడు చిరంజీవిగా బతుకుతాడని చెప్పి మాయమవుతారు. దేవుడి వరంతో రాజదంపతులకు బాలుడు జన్మిస్తాడు. పరమేశ్వరుడు తెలిపిన విధంగా బాలుడు 12 దినాలకన్నా ఎక్కువ రోజులు బతుకడని తెలిసి రాజదంపతులు బాధపడుతుంటారు.
రాజు పడుతున్న బాధను చూడలేని మంత్రి సాగరుడు రాజు కుమారుడైన బాలరాజుకు వివాహం చేయాలనుకుంటాడు. ఒక రోజు మంత్రి తన కుమారుడి ఫొటోను చూయించి కౌలాసపురము (నేటి కౌలాస్)ను పాలిస్తున్న రాజు దేవదేవుడి కుమార్తె గాంధారితో వివాహం చేయాలని నిశ్చయిస్తారు. కానీ ఎవరికీ అనుమానం రాకుండా తన కుమారుడికి బదులుగా 12 రోజుల బాలుడు బాలరాజుకు 12 సంవత్సరాల రాకుమార్తె గాంధారితో వివాహం జరిపిస్తాడు. అనంతరం పెండ్లి కుమార్తె గాంధారిని, బాలరాజుతోపాటు పల్లకిలో అత్తారిల్లు దేవరపేటకు తీసుకువస్తుండగా గాంధారి విశ్రాంతి తీసుకుంటుంది. ఇంతలో ఈ బాలుడు నీ భర్త, అతని పేరు బాలరాజు అతనిని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నీది అని తెలుపుతూ అతని మెడలో లిఖితపత్రం కట్టి అడవిలో వదిలి వెళ్లిపోతారు. అప్పటికే నిద్రలో ఉన్న గాంధారి లేచి చూసే సరికి పల్లకిలో ఏడుస్తున్న బాలుడి మెడలో ఉన్న పత్రాన్ని చూసి గాంధారి విలపిస్తుంది. గాంధారి బాలుడు బాలరాజుని ఎత్తుకొని అడవిలో రోజుల తరబడి నడుస్తూ గాంధారిలో ప్రస్తుతం ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని బస చేస్తుంది. బాలుడిని ఆలయ ధర్మశాలలోనే పడుకోబెట్టి స్నానం చేయడానికి గాంధారి వాగుకు వెళ్తుంది. ఇది గమనించిన దొంగలు గుడిలో పడుకోబెట్టిన బాలరాజును కత్తులతో చంపి, అక్కడ ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని వెళ్తారు.
వాగు నుంచి వచ్చిన గాంధారి చనిపోయి బాలరాజును చూసి విలపిస్తుంది. గాంధారి ముందు శివపార్వతులు ప్రత్యక్షమవుతారు. నీవు అధైర్యపడకు నీ బొటన వేలు చివరిలో అమృతం ఉందని బాలుడి నోటిలో వేలు పెడితే తిరిగిలేస్తాడని చెప్పి మాయమవుతారు. దీంతో గాంధారి బొటన వేలిని బాలరాజు నోట్లో పెట్టగానే తిరిగి లేస్తాడు. ఈ విధంగా గాంధారి తన భర్తను బతికించుకుంటుంది. ఒక రోజు గాంధారి, బాలరాజుకు ఆకలివేయడంతో దేవరపేటకు చేరుకుంటుంది. అక్కడ రాజు నరేంద్రుడు గాంధారిని చూసి మీది ఏ ఊరు అని ప్రశ్నించగా అప్పుడు గాంధారి తన చిన్న తనంలోనే ఈ బాలుడితో వివాహం చేసి అడవుల్లో వదిలి వెళ్లారని తెలుపుతుంది. దీంతో అడవిలో వదిలి పెట్టిన ఆ బాలుడు తన కుమారుడే అని, ఆ బాలిక తన కోడలని గుర్తుపట్టిన రాజు, ఏడేండ్ల తర్వాత తన కుమారుడు బాలరాజు చిరంజీవిగా తిరిగి వచ్చినందుకు సంతోషిస్తాడు. అనంతరం గాంధారి బాలరాజులకు పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం అప్పగిస్తాడు. భర్త చిన్నవాడు కావడంతో పాలనా వ్యవహారాలన్నీ గాంధారి చూసుకునేది. అప్పటి నుంచి దేవరపేట రాజ్యం గాంధారి రాజ్యంగా ముద్రపడినట్లు చరిత్ర చెబుతున్నది.
గాంధారి బాలరాజు కొలువైన ఆలయం
ఆలయంలోని విగ్రహాలే నిదర్శనం..
12 రోజుల బాలరాజు, 12 ఏండ్ల వయస్సుగల గాంధారి భార్యాభర్తలు. అయినా వారిద్దరి మధ్య వయస్సులోని తేడాలను తెలిపే విధంగా ఆంజనేయస్వామి ఆలయంలో గాంధారి, బాలరాజు విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు హనుమాన్ విగ్రహంతోపాటు గాంధారి, బాలరాజు విగ్రహాలకు సైతం పూజలు చేస్తారు. ఇప్పటికి గాంధారి గ్రామానికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే, ఆలయ చరిత్రను తెలుసుకొని విగ్రహాలను పరిశీలిస్తుంటారు.
గాంధారిలో కలిసిన గ్రామాలు..
ప్రస్తుతం ఉన్న గాంధారి గ్రామంలో చుట్టు పక్కల గ్రామాలు చాలా వరకు కలిసిపోయాయి. గాంధారిలో దేవరపేటతోపాటు, మొకురంపేట, బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాల ప్రజలు తమ నివాస గృహాలను వదిలి గాంధారిలో స్థిరపడ్డారు. ఆయా గ్రామాల ప్రజలు తమ ఇండ్లను వదిలిపెట్టడంతో శిథిలమైపోయిన ఇండ్ల ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఆయా గ్రామాల పేర్లతోనే శివారు భూములు ఉన్నాయి.