భీమదేవరపల్లి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న ఆశయాలను, లక్ష్యాలను యువత మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మాడుగుల అజిత్ కుమార్ పేర్కొన్నారు. నాడు తెలంగాణ యువత అన్యాయాలను ప్రశ్నించింది. ప్రభుత్వాలను నిలదీసింది. హక్కుల కోసం పోరాడింది. కానీ నేడు సమాజం ఎటువైపు నడుస్తోంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోందని అజిత్ కుమార్ అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించిన యువత, నేడు ఎందుకు వ్యసనాల వైపు దారి మళ్లుతోందని ఆయన ప్రశ్నించారు.
ఉద్యమాలు నడిపిన యువశక్తి నేడు మత్తు పదార్థాల బారిన పడటం బాధాకరమన్నారు. గ్రామీణ స్థాయిలో పెరుగుతున్న వ్యసనాలపై ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, మేధావులు, యువజన సంఘాలు మరింత బాధ్యతతో స్పందించాలని కోరారు. అందరు కలిసి గ్రామాల అభివృద్ధి, యువత భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేసినప్పుడే అమరవీరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించినవారమవుతామని తెలిపారు.