మాక్లూర్, జనవరి 21: మాక్లూర్ మండలం చిక్లీ గ్రామ పంచాయతీ పరిధిలోని చిక్లీ క్యాంపునకు చెందిన ఎయిర్ఫోర్స్ ఉద్యోగి రవిచంద్ర(33) అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ జిల్లా పిడుగురాళ్ల రైల్వేస్టేషన్లో రైలు నుంచి దిగుతుండగా కాలు జారి కిందపడగా, తీవ్రగాయాలతో మరణించాడు. రవిచంద్ర మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకున్నది.
ఆదివారం రవిచంద్ర మృతదేహంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి అంత్యక్రియలకు తరలించారు. శ్మశాన వాటికలో రవిచంద్ర మృతదేహం వద్ద జవాన్లు గౌరవ వందనం చేసి, గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి ఘన నివాళులర్పించారు. ఎయిర్ఫోర్స్ అధికారి చవాన్ పాల్గొని రవిచంద్ర భార్య, కూతుళ్లు, తల్లిదండ్రులను ఓదార్చారు. రవిచంద్ర అంత్యక్రియలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు తెలిపారు.