నిజాంసాగర్, సెప్టెంబర్ 11 : నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హెడ్స్లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. జల విద్యుత్ ఉత్పత్తి సుందరీకరణ పనులకు నిధులు రావడంతో జల వెలుగులకు పూర్వ వైభవం రానున్నది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మార్గనైజేషన్లో భాగంగా కాలం చెల్లిన వైర్లు, పరికరా ల తొలగింపుతోపాటు టర్బయన్ల మరమ్మతు పనులు చేస్తున్నారు. దీంతో పాటు ఆటోమెటిక్ పవర్ స్టార్ట్ సామగ్రిని సైతం బిగిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదటి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణ పనులకు నోచుకుంటుంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో హెడ్స్లూయిస్ వద్ద 1954 సంవత్సరంలో జల విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించారు. మూడు టర్భయిన్లను ఏర్పాటు చేసి 15 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇంగ్లాడ్ దేశం నుంచి టర్బయిన్లను తీసుకువచ్చి బిగించారు. ఒక్కో టర్బయిన్ 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేసి నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని ఆయకట్టుకు విడుదల చేసిన సమయంలో ప్రధాన కాలువ ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల సమయంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేవారు. అయితే మూడు టర్బయిన్లను ఏర్పాటు చేసి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించేవారు. కాలక్రమేణ 20 సంవత్సరాలపాటు టర్బయిన్లు చక్కగా పనిచేస్తుండగా 1974 సంవత్సరంలో ఒక టర్బయిన్ మొరాయిస్తూ మూలనపడింది. దీంతో గడిచిన 50 సంవత్సరాలుగా రెండు టర్బయిన్ల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. మొరాయిస్తున్న టర్బయిన్ మరమ్మతుల కోసం పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దానికి నివేదికలు తయారు చేసి పంపించడంతో ఇటీవల మొరాయిస్తున్న టర్బయిన్ మరమ్మతులతోపాటు కాలంచెల్లిన యంత్రాలు, ఆటోమెటిక్ స్విచ్ సిస్టంతోపాటు పలు యంత్రాల బిగింపు కోసం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం పనులు చురుకుగా సాగుతున్నాయి.
జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆధునీకరణ పనులు నాలుగు నెలల నుంచి చురుకుగా సాగుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఫ్యాన్ బోర్డులతోపాటు కేబుల్ వైర్లు రోప్ వైర్లు, టర్బయిన్ల మరమ్మతు పనులు, మ్యానువల్ ఆటో ఆపరేషన్, లూబాల్ సిస్టం, కంట్రోల్ ఆపరేషన్ సిస్టం, కొత్త గవర్నర్తోపాటు పలు యంత్రాల బిగింపు పనులు నిర్వహిస్తున్నారు. ఆధునీకరణ పనులు దక్కించుకున్న ఢిల్లీకి చెందిన కాంట్రాక్టు సంస్థ మరమ్మతు పనులు చురుకుగా కొనసాగిస్తుండగా ఇప్పటి వరకు 40 శాతం మేర పనులు పూర్తిచేశారు. కాలం చెల్లిన పరికరాలను తొలగిస్తూ కొత్త యంత్రాలను బిగిస్తున్నారు. జల విద్యు త్ ఉత్పత్తి కేంద్రం మ్యానువల్ పద్ధతిన కాకుండా ఆటోమెటిక్ విధానంలో విద్యుత్ ఉత్పత్తి జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మరమ్మతు పనులు కొనసాగుతుండడంతో ఈ యేడాది విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్లు పడ్డాయి.
జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆధునీకరణ పనులతో పూర్వ వైభవం రానుంది. సుందరీకరణ పనులకు నిధులు రావడంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 40 శాతం మేర పనులు పూర్తయాయ్యి. మ్యానువల్ విధానంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆటోమెటిక్ విధానంలో మార్పు చేయనున్నాం. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్ట మొదటి విద్యుత్ ఉప కేంద్రానికి మళ్లీ పూర్వపు రోజులు రానుండడం సంతోషంగా ఉంది.
– రవీందర్, ఏడీ, జెన్కో, సివిల్