బోధన్, మే 25: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగిస్తున్నది. అంతర్జాతీయ అంశాల పేరిట సామాన్యులకు వాత పెడుతున్నది. ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి పెట్రో ధరలను పెంచేసుకుంటూ పోతున్నది. తాజాగా సోమవారం మరోసారి రేట్లు పెంచేశారు. రాష్ట్రంలో సరాసరిన లీటర్ పెట్రోల్పై రూ.2.84, లీటర్ డీజిల్పై రూ.రూ.2.86 చొప్పున బాదారు. కేవలం పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రో ధరలు పెరగడంతో సామాన్యులు, రైతులు విలవిలలాడుతున్నారు. నాలుగు విడుతలుగా లీటర్పై దాదాపు రూ.8-9 వరకు భారం పెరిగింది. పెట్రో ధరల పెంపుపై సామాన్యుల నుంచి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ, కేంద్రం వెనక్కి తగ్గటం మాటలా ఉంచి మరింతగా పెంచడం గమనార్హం.
ధరల పెంపుతో జనం ఇక్కట్లు
పెట్రో ధరలను విపరీతంగా పెంచడంతో అన్ని రంగాలూ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా పంటల సాగులో రైతులు డీజిల్ను ఆధునిక వ్యవసాయ పరికరాల్లోనూ, ట్రాక్టర్లలోనూ వినియోగిస్తుంటారు. ఇప్పటికే పంటలకు సరైన ధరలు రాక ఇబ్బంది పడుతున్న అన్నదాతల పాలిట ఈ ధరల పెంపు శాపంగా మారనుంది. రవాణా రం గంపై పెట్రో ధరల పెంపు ప్రభావం గణనీయంగా ఉంటుంది. నిత్యావసర సరుకుల ధరలు, ముఖ్యంగా కూరగాయల ధరలు గత వారం రోజులుగా పెరిగాయి. నాలుగోసారి పెట్రో ధరలను పెంచటంతో వీటి ధరలు మరింతగా పెరుగుతాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
పది రోజుల్లో నాలుగోసారి..
హైదరాబాద్లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరిగిన రెండు రోజులకే ఈ నెల 15న మొదటిసారిగా పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. జిల్లాలో వాహనదారులపై లీటర్ పెట్రోల్ ధర రూ.3.39 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.3.27 చొప్పున పెరిగింది. ధరల పెంపుపై ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను కేంద్ర సర్కార్ బేఖాతర్ చేస్తూ మరో నాలుగు రోజులకు, అంటే మే 19న లీటర్పై మరో 90 పైసల నుంచి రూపాయి దాకా పెంచింది. తిరిగి రెండు రోజుల క్రితం లీటర్కు మరో రూపాయి చొప్పున మూడోసారి బాదేసింది. తాజాగా సోమవారం నాలుగో సారి పెట్రో ధరలను భారీగా పెంచింది. ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రావడంతో సామాన్యులు నోరెళ్లబెట్టారు. నాలుగోసారి దాదాపు రూ.3 దాకా వడ్డించారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 117.05, లీటర్ డీజిల్ ధర రూ.105,21గా ఉన్నది. మొత్తంగా జిల్లా ప్రజానీకం మీద పది రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్పై రూ. 8.23, డీజిల్పై రూ.8.12 చొప్పున భారం పడింది. మరోసారి పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న సంకేతాలు వస్తుండటంతో వాహనదారులు, రైతులు భయపడుతున్నారు.
మోదీ ప్రభుత్వం వైఫల్యం వల్లే..
మోదీ ప్రభుత్వ వైఫల్యం, చమురు దిగుమతులపై సమయానుకూలంగా వ్యవహరించక పోవడమే నేటి పెట్రో ధరల సంక్షోభానికి కారణం. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలో పుష్కలంగా చమురు నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రధాని.. ఎన్నికల తర్వాత ధరలు పెంచటం విచిత్రంగా ఉన్నది. సామాన్యులపై మోయలేని భారంగా ఉన్న ఈ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి.
– ఆర్.గౌతమ్కుమార్, పీడీఎస్యూ, జిల్లా అధ్యక్షుడు
ధరల మోతతో అందరికీ ఇబ్బందులు..
పెట్రో ధరల పెంపుతో సామాన్యులు, ఉద్యోగులు, యువకులు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. వాహన దారులకు ఇది మోయలేని భారం. కూరగాయలు, నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇది ప్రజలకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నది. పెట్రోల్ ధరల పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి.
– మందుగుల విద్యాసాగర్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, బోధన్