ఖలీల్వాడి/కామారెడ్డి, డిసెంబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని జిల్లా స్థాయిలో శనివారం ప్రారంభించారు. నిజామాబాద్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధూశర్మ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన వద్ద రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుకు కలెక్టర్ పచ్చజెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులతో కలిసి జీజీహెచ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కలెక్టర్ బస్సులో ప్రయాణం చేశారు. బస్సులోని మహిళలకు ఎలాంటి చార్జీలు లేకుండా జీరో ఫేర్తో కూడిన మహాలక్ష్మి టికెట్లను కలెక్టర్ స్వయంగా ప్రయాణికులకు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తేవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికీ పరిమితి పెంపుతో కూడిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు, బాలికలు, యువతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత రవాణా వసతి వర్తిస్తుందన్నారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ ఐడీ వంటి ఏదైనా గుర్తింపు కార్డును చూ పించి, ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని సూచించారు. కార్యక్రమాల్లో ఆర్టీసీ ఆర్ఎం జాన్రెడ్డి, డీఎంహెచ్వో సుదర్శనం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, నాయకులు మానాల మోహన్రెడ్డి, తాహెర్బిన్ హందాన్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో రూ.15 లక్షల భారం
కామారెడ్డి డిపో పరిధిలో 12 వేల మంది, బాన్సువాడ నుంచి 5 వేల మంది మహిళలు సుమారు 17 వేల మందికి పైగా బస్సులో ప్రతిరోజు ప్రయాణం చేస్తారు. ఉచిత ప్రయాణంతో ప్రభుత్వం పై రూ.15 లక్షల వరకు భారం పడనున్నది.
ప్రయాణికుల ఎదురుచూపులు..
మహాలక్ష్మి పథకాన్ని మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో కామారెడ్డి బస్టాండ్ డిపో వద్ద మహిళలు గంట ముందు నుంచి ఎదురుచూశారు. అధికారులు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. దీంతో డిపో మేనేజర్ అధికారులు వచ్చినప్పుడు బస్సులో పంపిస్తామని చెప్పడంతో ప్రయాణికులు తప్పదన్నట్లుగా కూర్చొన్నారు. కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించడంతో బస్సులో ఎక్కారు. కండక్టర్ వారికి జీరో టికెట్ ఇచ్చారు.