ఇందూరు, మార్చి 11 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. యువత కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ రమావత్ లాల్సింగ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నేనావత్ చైత్రమ్ రాథోడ్ ఆధ్వర్యంలో నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శుక్రవారం ‘యువత మేలుకో-నిన్ను నీవు ఏలుకో, ‘మద్యం, మారక ద్రవ్యాలు -యువత ఎదుగుదలకు అవరోధాలు’ అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ కేఆర్ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ప్రముఖ వైద్యుడు విశాల్, చందమామ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బిలోజీ నాయక్, న్యాయవాది ఆశ నారాయణ హాజరయ్యా రు. మత్తు పదార్థాల నిర్మూలన కోసం యువకుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం సీపీ నాగరాజు మాట్లాడుతూ .. మాదక ద్రవ్యాలు, గంజా యి నిర్మూలన కోసం పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. గంజాయి నిర్మూలన కోసం ప్రజాప్రతినిధులు కలిసిరావాలని కోరారు. మత్తుకు బానిసైన వారి వివరాలను తమకు తెలియజేస్తే వారి జీవితాన్ని మం చి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉందన్నారు. ఒక్క ఫోన్ కాల్తో వారినే కాకుండా వారి కుటుంబాన్ని కాపాడిన వారవుతారన్నారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు , విద్యార్థి సంఘాల నాయకులు, టీవీయూవీ జిల్లా అధ్యక్షుడు అజయ్, కామారెడ్డి జిల్లా ఇన్చార్జి నవీన్, నగర అధ్యక్షుడు సందీప్, నర్సాగౌడ్, సర్దార్నాయక్, వెంకటేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.