ధర్పల్లి(ఇందల్వాయి)/ఖలీల్వాడి, మార్చి 13: ఇందల్వాయి మండలంలోని గన్నారం సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఏడుగురు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

డిచ్పల్లి సీఐ వినోద్, బాధితుల కథనం మేరకు.. ఖురానా ట్రావెల్స్కు చెందిన బస్సు గురువారం రాత్రి 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు బయల్దేరింది. ఇందల్వాయి సమీపంలోని గన్నారం వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి రాయిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన తల్లి, కుమారుడు మంజూష (32), రిషి (7), బెంగళూరుకు చెందిన అబ్బాస్ (35) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో నడపడం వల్లే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు. డ్రైవర్ నిద్రపోతున్నట్లు గుర్తించి తాము అప్రమత్తం చేశామని, అయినప్పటికీ అలాగే నడిపి యాక్సిడెంట్ చేశారని వాపోయారు. ప్రమాదంలో భార్య, బిడ్డను కోల్పోయిన బాధితుడు లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్పల్లి సీఐ వినోద్ తెలిపారు.