బిచ్కుంద, ఫిబ్రవరి 15: జుక్కల్ నియోజకవర్గంలో సోయా విత్తన శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మెట్ట భూములు ఉన్నందున సోయా పంటను అధికంగా సాగు చేస్తుండడంతో ఇక్కడి రైతులకు విత్తన శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో మాట్లాడుతానని తెలిపారు. బుధవారం ఆయన బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్, నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సభాపతి మాట్లాడారు. నియోజవర్గంలో రైతులు పప్పు దినుసులు, నూనె ఉత్పత్తి చేసే పంటలు అధికంగా సాగు చేస్తున్నందున మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుంటే రూ. మూడు లక్షలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. బిచ్కుందతోపాటు పెద్దకొడప్గల్, నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో సెంట్రల్ లైటింగ్, రెండు వరుసల రహదారి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సమైక్యపాలనలో తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి నిధులు కేటాయించడంతో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే షిండే కోరిక మేరకు సీఎం కేసీఆర్తో మాట్లాడి రూ.200 కోట్లు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తాము తెలంగాణలో జన్మించి ఉంటే బాగుండేదని తనతో అన్నారని గుర్తుచేశారు. మంజీరా నదిపై వంతెనల నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే షిండేను సభాపతి అభినందించారు. ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. బిచ్కుంద డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ-గ్రేడ్ వచ్చిందని, పీజీ కళాశాలతోపాటు కొత్త మండలాలైన పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో జూనియర్ కళాశాలలను మంజూరుచేయాలని సభాపతిని కోరారు.
బిచ్కుంద సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని సభాపతి పోచారం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో శనగలకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు అధిక ధర ప్రకటించిందని తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ జితేశ్వ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీపీ అశోక్పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, ఏఎంసీ చైర్మన్ నాగనాథ్ పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, బిచ్కుంద, పుల్కల్ విండో చైర్మన్లు బాలజీ, రాంరెడ్డి పటేల్, ఆర్డీవో రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.