పిట్లం, డిసెంబర్ 9: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం పెట్టి అందరినీ కాపాడుకుంటానన్నారు. ఓడిపోయామని బాధ పడాల్సిన అవసరం లేదని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాను అండగా ఉంటానని, వారి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుగా వేసి కాపాడుకుంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం మండలకేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన ఐదు మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎవరూ ఆందోళన చెందవద్దని, తక్కువ ఓట్లతో ప్రజలు ఓడించారని తెలిపారు. నియోజకవర్గంలోని 130 మంది సర్పంచులు, 70 మంది ఎంపీటీసీలు, ఆరుగురు ఎంపీపీలు, ఐదుగురు జడ్పీటీసీలు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని, రానున్న స్థానిక ఎన్నికల్లో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి రెండు దఫాలుగా జడ్పీ చైర్మన్ స్థానం దక్కించుకున్నామని గుర్తుచేశారు. 50 ఏండ్ల చరిత్రలో నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ..బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.
వంద గ్రామాలకు బీటీరోడ్లు, రహదారులపై బ్రిడ్జిలు, డబుల్ రోడ్ల నిర్మాణం, ఎంపీ బీబీపాటిల్ సహకారంతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ ఐదేండ్ల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేద్దామని సూచించారు. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సహకారంతో 35 వేల ఓట్ల మెజార్టీ, 2018లో 36 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు స్వల్ప గాయం అయ్యిందని, తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు అయ్యే వరకు నిద్రపోవద్దన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, పెద్దకొడప్గల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ బిచ్కుంద, పెద్దకొడప్గల్, నిజాంసాగర్, మహ్మద్నగర్ మండలాల అధ్యక్షులు, ఏఎంసీ, విండో చైర్మన్లు, సర్పంచు లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు దుర్గారెడ్డి, విజయ్, లక్ష్మారెడ్డి, నర్సాగౌడ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, బాబూసింగ్, దేవేందర్రెడ్డి, సాయిరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.