బోధన్, డిసెంబర్ 5: ‘బోధన్ నియోజకవర్గంలో ఓడిపోయినందుకు కార్యకర్తలు అధైర్య పడవద్దని.. అండగా ఉంటామని.. ప్రతీ నిమిషం మీ వెంటే ఉంటా.. లక్ష ఎనుగుల బలం మీకు ఇస్తా..’ అని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పార్టీ నాయకుల, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని ఆయన అభినందించారు. బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ తన ఓటమికి నాయకులు, కార్యకర్తలు కారణం ఎంతమాత్రం కాదని.. ఫలానా గ్రామం, వార్డులో మెజార్టీ రాలేదంటూ సంబంధిత నాయకులపై నిందలు మోపవద్దన్నారు.
రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారన్నారు. కొత్త ప్రభుత్వం మంచి పనులు చేస్తే తాము సహకరిస్తామని, అయితే వారు తమ హామీలను నెరవేర్చకపోతే పోరాటాలు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం నడిపిన తమకు అధికారం ప్రధానం కాదని, అవసరమైతే తెలంగాణ కోసం మరొక ఉద్యమం నడుపుతామని స్పష్టం చేశారు. పదేండ్ల పాటు బోధన్ నియోజకవర్గ ప్రజలు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఇందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కాంగ్రెస్ది నిజమైన గెలుపు కాదని, తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయామన్నారు.
మూడు నెలల తర్వాత కేసీఆరే సీఎం..
‘పదవుల కోసం కాంగ్రెసోళ్లు ఐదు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ క్యాంప్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పారిపోతున్నారు.. వాళ్లలో వాళ్లే కొట్టుకోవడంతో రెండు నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. గ్యారంటీగా చెబుతున్నా.. రెండు, మూడు నెలల్లో మళ్లీ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.. మూడు నెలల తర్వాత కేసీఆరే ఈ రాష్ర్టానికి సీఎం అవుతారు..’ అంటూ షకీల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెసోళ్లకు పదవులే ప్రధానమని, ప్రజల సమస్యలు వారికి పట్టవని విమర్శించారు. తెలంగాణకు శ్రీరామరక్షగా నిలిచిన కేసీఆర్ త్వరలోనే మళ్లీ సీఎంగా వస్తారని చెప్పారు.
గెలిచిన అహంతో దౌర్జన్యం..
గెలిచిన మర్నాడు బోధన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, మైనార్టీ యువకులపై కొంతమంది కాంగ్రెసోళ్లు దౌర్జన్యం చేశారని, ఇది పిరికిపంద చర్యని షకీల్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడిచేసి తన విలువైన వస్తువులను,. పత్రాలను దొంగతనం చేశారని, దీన్ని నివారించిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మైనార్టీ యువకులపై దాడిచేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా దాడిలో గాయపడిన మైనార్టీ యువకుడి చేతికి, కాలికి అయిన గాయాలను షకీల్ సభా వేదికపైన చూశారు. ఇటువంటి చిల్లర పనులు కుక్కలు మాత్రమే చేస్తాయని, కాంగ్రెసోళ్లు రౌడీలు, గుండాల్లాగా వ్యవహరించారని విమర్శించారు. ఇటువంటి పనులు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్రెడ్డి ఇటువంటి గూండాలు, బ్రోకర్లను ప్రోత్సహించరాదని, వీరిని దూరంగా పెట్టి తనకున్న పేరును కాపాడుకోవాలని హితవుచెప్పారు.
కంటనీరు పెట్టిన బోధన్ ఏఎంసీ చైర్మన్
సమావేశంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరావు దేశాయ్ మాట్లాడుతూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కంటనీరు పెడుతూ రోదించారు. షకీల్ ఎంతో మంచి మనిషి.. మచ్చలేని నాయరేడు.. పదేండ్లుగా బోధన్ నియోజకవర్గం అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో కృషిచేశారు. ఇటువంటి ప్రజల మనిషి షకీల్ ఓడిపోవడం దురదృష్టకరం..’ అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. షకీల్ ఆయనను ఓదార్చారు. ఈ సందర్భంగా షకీల్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, బుద్దె రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, బీఆర్ఎస్ బోధన్ పట్టణం, వివిధ మండలాల అధ్యక్షులు రవీందర్ యాదవ్, గోగినేని నరేంద్రబాబు (నర్సయ్య), సంజీవ్కుమార్, డి.శ్రీరామ్, నర్సింగ్రావు, భూంరెడ్డి, నాయకులు ఆబిద్ అలీ, సంగం వెంకట్రెడ్డి, తెలంగాణ శంకర్, సిర్ప సుదర్శన్, పి.గంగాధర్గౌడ్, ఆబిద్, బెంజర్ గంగారాం, శంకర్గౌడ్, అబ్దుల్ రహ్మాన్, కార్యకర్తలు పాల్గొన్నారు.