ఆర్మూర్టౌన్, ఫిబ్రవరి 25: పట్టణంలోని దేవాంగ సామాజిక వర్గం కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్ అధికార పార్టీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకున్నదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బుధవారం పర్యటించారు. తాను ప్రారంభించిన జనతా గ్యారెజీలో క్రైమ్ నంబర్ 17గా నమోదైన దేవాంగ ఫంక్షన్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీ-కన్వెన్షన్ సెంటర్ కాంగ్రెస్ కలెక్షన్ సెంటర్గా మారిందని మండిపడ్డారు.
నిజమాబాద్ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న 2వేల గజాల భూమిలో రూ.75 లక్షలతో ఫంక్షన్ హాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం 8 కోట్ల రూపాయల విలువైన ఈ సీ కన్వెన్షన్ సెంటర్పై కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి కన్ను పడిందన్నారు. ఎలాగైనా దీన్ని కబ్జా చేయడానికి అద్దె కోసం అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్ బాధ్యతను తన అనుంగు శిష్యుడైన భూపెంధర్కు అప్పగించాడని తెలిపారు.
వినయ్ రెడ్డి కను సన్నల్లోనే భూపెంధర్ ఈసీ కన్వెన్షన్ సెంటర్ను కాంగ్రెస్ కలెక్షన్ సెంటర్గా, అవినీతి హెడ్ క్వార్టర్గా మార్చారని మండిపడ్డారు. వినయ్ రెడ్డి అవినీతి దందా అడ్డూ అదుపులేకుండా కొనసాగుతున్నదని మండిపడ్డారు. గత ప్రభుత్వం వివిధ కుల సంఘాలకు నిర్మించిన ఫంక్షన్ హాళ్లను అధికార పార్టీ నేతలు నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, వినయ్ రెడ్డి అవినీతి బాగోతాలపై విచారణ జరిపించి చిప్పకూడా తినిపిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల అరాచకాలను అడ్డుకునేందుకు కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన దేవాంగులకు న్యాయం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.