నాగిరెడ్డిపేట, ఏప్రిల్ 18 : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మండలంలోని మెల్లకుంటతండాలో శుక్రవారం నిర్వహిం చిన గ్రామ పంచాయతీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
అడగకుండానే గిరిజనుల సమస్యలను తెలుసుకుని తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 80కి పైగా తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేశారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారని గుర్తుచేశారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వచ్చే రెండేండ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎల్లారెడ్డిలో తాను చేపట్టిన అభివృద్ధి పనులకు కొత్తగా రంగులు వేసుకొని వారి పేరు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్లారెడ్డికి ఎన్ని నిధులు తెచ్చారో చూపించాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో ఎల్లారెడ్డిని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఎల్లారెడ్డిలో ఓ విద్యార్థి హాస్టల్లో చనిపోతే స్థానిక ఎమ్మెల్యే కనీసం పరామర్శించకుండా, బీఆర్ఎస్ సర్పంచులను తమ పార్టీలో చేర్చుకోవడంలో బీజీగా మారారని ఎద్దేవా చేశారు. యాసంగిలో రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని, సన్నాలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి 70 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని కానీ తెలంగాణకు రూపాయి తెచ్చింది లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్ప డం ఖాయమని పేర్కొన్నారు.తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనునాయక్ అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య, మాజీ జడ్పీటీసీ మనోహర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సాయిబాబా, సర్పంచులు వంశీగౌడ్, మహేందర్, సురేశ్, సాయిలు, నారాయణ, యాదగిరి, శ్రీను, కృష్ణ, దేవీసింగ్, సాయిలు, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.