ఎల్లారెడ్డి,(లింగంపేట) మే 17: లింగంపేట మండలంలోని కన్నాపూర్ చెరువుకు మరమ్మతులు వారం పది రోజుల్లో చేపట్టకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం ఆయన కన్నాపూర్ చెరువును సందర్శించి, అక్కడికి వచ్చిన వందలాది మంది రైతులతో మాట్లాడారు. వందేండ్ల చరిత్ర ఉన్న కన్నాపూర్ చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాలు సాగు అవుతుందని, గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట పూర్తిగా కొట్టుకుపోయిందని రైతులు జాజాలకు వివరించారు. కన్నాపూర్, పోల్కంపేట, కొత్తపల్లి చెరువులకు వారం పది రోజుల్లో మరమ్మతులు ప్రారంభించకపోతే తాను రైతులతో కలిసి పాదయాత్రగా తరలివెళ్లి కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడిస్తామని జాజాల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు.
రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రూ. 15 వేలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు పండించి ధాన్యం అమ్ముకోవడానికి వారు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోనే రోజంతా పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ధాన్యాన్ని తూకం వేయడం లేదని, వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావడం లేదన్నారు. డ్రైవర్లు ఒక్కో లారీకి రూ. ఐదు వేల నుంచి రూ. పది వేల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. చెరువుల కట్టలు తెగి పోయి నీరు ఎండి పోవడంతో నాలుగైదు గ్రామాలకు తాగునీటికి కటకట ఏర్పడిందని ఆయా గ్రామాల ప్ర జలు చెబుతున్నారని తెలిపారు.
గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంటలు, చెరువుల పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసినా పైసా పని జరగలేదని, ఇదేం ప్రజా పాలన అని జాజాల మండిపడ్డారు. పది నెలల క్రితం జరిగిన నష్టానికి ఇప్పటి వరకు పరిహారం రాలేదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఉంటాయని ఆ రోజు సీఎం చెప్పిన విషయం ప్రజలకు గుర్తు ఉన్నదని, వారు అవసరమైనప్పుడు సమాధానం చెబుతారన్నారు. జాజాల వెంట లింగంపేట మండలంలోని కన్నాపూర్, పోల్కంపేట, కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు.