మోర్తాడ్/వేల్పూర్, జూలై 15: భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కఠోర దీక్షకు పూనుకోగా, ప్రభుత్వం కక్షగట్టి విఫలం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. దీక్ష చేపట్టనున్న భీమ్గల్కు వెళ్లకుండా వేములను గృహ నిర్బంధం చేయించింది. భీమ్గల్లో దీక్షా శిబిరాన్ని ఎత్తేయించడంతో పాటు వందలాది పోలీసులను దింపి వేల్పూర్ను దిగ్బంధించింది. అనేక ఆంక్షలు విధించి, బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా దీక్షకు మద్దతుగా వెల్లువలా వచ్చిన ప్రజలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం శతవిధా లా ప్రయత్నించింది. సర్కారు, పోలీసుల సంయుక్త ఆంక్షల నడుమ.. వేముల తన ఇంట్లోనే కఠోర దీక్షకు దిగారు. ఉదయం 10 నుంచి సాయం త్రం 5 వరకు 7 ఏడు గంటల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష కొనసాగించారు.
అక్రమ అరెస్టులు..
భీమ్గల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే డిమాండ్తో కఠోర నిరాహార దీక్ష చేపట్టాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉదయం నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 80 మంది పోలీసులు వేల్పూర్ను చుట్టుముట్టారు. ప్రశాంత్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతి కూడలిలో సిబ్బందిని మోహరించి ఇతర గ్రామాల నుంచి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే వేల్పూర్, ఆర్మూర్ ఠాణాలకు తరలించారు.
దీక్ష విజయవంతం..
వంద పడకల దవాఖాన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం, బస్డిపో పునఃప్రారంభం, సీసీరోడ్ల పనులను పూర్తి చేయాలనే డిమాండ్తో ప్రశాంత్రెడ్డి తన స్వగృహంలో చేపట్టిన దీక్ష దిగ్విజయవంతమైంది. వేల్పూర్కు చెందిన మహిళా నాయకురాలు భాగ్య బొట్టుపెట్టి పూలమాల వేయగా, ఎమ్మెల్యే దీక్ష ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంచినీళ్లు కూడా తాగకుండా దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యేకు మహిళలు పెద్ద సంఖ్యలో సంఘీభావం ప్రకటించారు.
వృద్ధులు సైతం వచ్చి ఆయనను ఆశీర్వదించి వెళ్లారు. వేములను నిర్బంధించడంపై ఓ వృద్ధురాలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా వారు నోరెళ్లబెట్టారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డికి డాక్టర్ మధుశేఖర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. బీఆర్ఎస్ నేతలు శేఖర్రెడ్డి, పూర్ణానందం, చిన్నారెడ్డి, ఆర్మూర్ మహేశ్, చౌట్పల్లి రవి, మేస కార్తిక్, నర్సయ్య, జేసీ గంగారెడ్డి, సతీశ్గౌడ్, భూమేశ్వర్, మహేందర్, రమేశ్, రామకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.