బీబీపేట్, మే 23: కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పులను చూసి దుఃఖిస్తున్నాడని పేర్కొన్నారు. రోజుల తరబడి వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మా రిందని, రైతులను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శనివారం ఆయన మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అక్కడి నుంచే అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, సివిల్ సప్లయ్ అధికారులకు ఫోన్ చేసి కొనుగోళ్లలో నెలకొన్న జాప్యంపై నిలదీశారు. కాంట్రాక్టర్తో మాట్లాడి లారీలను త్వరగా పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయం, కాంగ్రెస్ పాలనలో దండగగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నదని తెలిపారు. లారీలు అందుబాటులో లేవని, కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. లారీలు ఉన్న చోట సంచులు ఉండవని, సంచులు ఉన్న చోట లారీలు ఉండవన్నారు. అకాల వర్షాల భయంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతులు గోస పడుతుంటే పట్టింకోవడం లేదని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రైతుల ముఖాల్లో సంతోషం
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజనూ కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని గంప గోవర్ధన్ అన్నారు. ఆయన హయాంలోనే రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రైతుల తరఫున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, సర్పంచ్ నాగరాజ్, ఉప సర్పంచ్ లక్ష్మీ రవి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేశ్వరరావు, నాయకులు వెంగళ్రావు, రవి, మల్లేశం, సాయాగౌడ్, శేఖర్, రవి, శ్రీనివాస్, నాగరాజ్, రైతులు ఉన్నారు