హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం పంపులు నడిపి గోదావరి జలాలను రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు హెచ్చరికలతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. పంపులు ఆన్చేసి రిజర్వాయర్లు, కాలువలు నింపితే ఎక్కడ కేసీఆర్కు మంచి పేరు వస్తదోనని మొండికేసిన ప్రభుత్వం.. బీఆర్ఎస్ తీవ్రమైన హెచ్చరికలకు తలొగ్గింది. దేవాదుల సహా ఎల్లంపల్లిలో పంపులు ఆన్ అయ్యాయి. అదే విధంగా మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి హెచ్చరికల నేపథ్యంలో నాగర్కర్నూల్ ఎత్తిపోతల పథకంలోనూ తాజాగా పంపులను ఆన్ చేశారు. గోదావరిలో నీళ్లున్నా రైతుల కండ్లల్లో నీటిపారుదలకు సర్కారే కారణమని ఈ ఏడాది ఫిబ్రవరి 21న హరీశ్రావు సర్కార్ను నిలదీశారు. హరీశ్ పర్యటించిన తెల్లారే దేవన్నపేట పంప్హౌస్లో ఒక పంప్ ఆన్ చేశారు.
దేవన్నపేట పంప్హౌస్ను పరిశీలించేందుకు వెళ్తే అది బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందనే అభిప్రాయంతో సీఎం రేవంత్రెడ్డి అప్పట్లోనే దేవాదుల ప్రాజెక్టు, పంపుల పనితీరుపై సమీక్షించారు. కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నదని ప్రభుత్వం తక్షణం నీళ్లు ఇవ్వకపోతే తామే పంపులను ఆన్ చేస్తామని జూలై 15న కేటీఆర్ అల్టిమేటమ్ జారీ చేశారు. జూలై 27న నంది మేడారం, గాయత్రి పంపుల్లోంచి గోదావరి జలాలు ఎగజిమ్మాయి. రామప్ప చెరువు తూములను సర్కార్ బంద్ పెట్టడంతో బీఆర్ఎస్ నేతలు సర్కార్ను హెచ్చరించాల్సి వచ్చింది. కన్నెపల్లి, దేవాదుల పంపులను ఎందుకు ఆన్ చేయరని హరీశ్రావు ప్రభుత్వాన్ని జూలై 12న నిలదీసిన తెల్లారే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదులలో పర్యటించి.. దేవాదుల కింద ఉన్న 22 రిజర్వాయర్లు నింపుతామని ప్రకటించారు. అందులో భాగంగానే జూలై 22న దేవాదులలోని 9 పంపులు ఆన్చేశారు.