బీజింగ్, సెప్టెంబర్ 15: దేశ పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పుగా పరిగణించే పౌరులు సహా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించే పరిధిని విస్తరించే కొత్త రాకపోకల(ఎంట్రీ-ఎగ్జిట్) నిబంధనలను చైనా మంగళవారం అమలులోకి తెచ్చింది. చైనా జాతీయ భద్రతకు లేదా ప్రయోజనాలకు హాని కలిగించే చట్టవిరుద్ధమైన లేదా నేరపూరిత చర్యలకు విదేశాలలో పాల్పడినట్టు తేలితే చైనా పౌరులు దేశం విడిచి వెళ్లకుండా ఆరు నెలల నుంచి మూడేండ్ల వరకు నిషేధించవచ్చని కొత్త నిబంధనలు పేర్కొంటున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. పారిశ్రామిక లేదా సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే ఎగుమతి నియంత్రణలు, సాంకేతికత దిగుమతి-ఎగుమతి నిబంధనల ఉల్లంఘనలు కూడా ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి.
సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ) వంటి కీలక రంగాల్లో ఆధిపత్యం కోసం చైనా, అమెరికా పోటీపడుతున్న తరుణంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ పరిశ్రమలకు చెందిన కొందరు ఉన్నతాధికారులు చైనాను విడిచి వెళ్లడంపై ఆంక్షలు ఎదుర్కొన్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. అధిక-ప్రమాదకరమైనవిగా పరిగణించే దేశాలు లేదా ప్రాంతాలకు ప్రయాణించవద్దని చైనా పౌరులకు సూచించాలని కూడా సరిహద్దు అధికారులను ఈ నిబంధనలు ఆదేశిస్తున్నాయి. మరోవైపు, వీసా దరఖాస్తులలో తప్పుడు సమాచారాన్ని సమర్పించే విదేశీయులకు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పాటు దేశంలోకి ప్రవేశం నిరాకరించవచ్చు.