పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు
మరో రెండు రోజులు వర్ష సూచన
ఉమ్మడి జిల్లాలో అతి భారీ వర్షాలకు చాన్స్
యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం
అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్సీ కవిత
రెండు జిల్లాల్లో ప్రత్యేక అధికారి చోంగ్త్త్తు పర్యటన
శాంతించిన గోదావరి, మంజీరా నదులు
ఎస్సారెస్పీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
ఉమ్మడి జిల్లాకు వాన ముప్పు పొంచి ఉన్నది.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు.. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ఇక, సోమవారం పొద్దంతా ముసురేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలకు పడిపోయింది. శీతల గాలులు వీయడంతో చలి తీవ్రత పెరిగింది. భారీ వర్షాలు, వరద ప్రభావంపై ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నుంచి అధికారులతో ఫోన్లో సమీక్షించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి క్రిస్టినా చోంగ్త్తు, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి సూచించారు. మరోవైపు, రెండు రోజుల పాటు మహోగ్ర రూపం దాల్చిన గోదావరి సోమవారం శాంతించింది. మంజీరా నదిలో కూడా వరద తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో వస్తుండడంతో ఎస్సారెస్పీ నుంచి 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిజామాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వర్ష సూచన హెచ్చరికలు. గోదావరిలో తగ్గని వరద ప్రవాహం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని తటాకాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వర్షపు నీరు. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లోనూ జలకళ. ఎస్సారెస్పీలో కొనసాగుతున్న ఔట్ ఫ్లో, ఇన్ఫ్లో. నిర్దిష్ట నీటిమట్టాన్ని బేరీజు వేస్తూ వరదను దిగువకు పంపుతున్న ఇంజినీర్లు. వాతావరణ శాఖ హెచ్చరికలతో సీఎం కేసీఆర్ దగ్గరి నుంచి జిల్లా యంత్రాంగం దాకా అడుగడుగునా అప్రమత్తం. మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవితల నిరంతర సమీక్ష. వెరసి వరద ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదివారం సూచించిన విధంగా మేఘ విచ్ఛిత్తి లాంటి పరిస్థితి ఏర్పడితే ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో కూలిన ఇండ్లు, కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లను పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహించి ప్రజలను అందులో నుంచి బయటికి పంపించారు.
సీఎం సమీక్ష…
నిజామాబాద్లో కనీవినీ ఎరుగని రీతిలో రెండు రోజుల క్రితం నమోదైన వర్షపాతంతో ప్రభుత్వం అప్రమత్తమై యంత్రాంగాన్ని మోహరించింది. నవీపేట, నందిపేటలో నమోదైన 20సెం.మీటర్ల వర్షపాతంతో ఏకంగా సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్ష సూచనల మేరకు ప్రజలను ఎక్కడికక్కడే యంత్రాంగం కట్టడి చేసింది. యంత్రాంగం నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు ధైర్యం అందిస్తుండగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిస్థితిపై సాక్షాత్తు సీఎం కేసీఆర్ దగ్గరి నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఇరు జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తూ సైతం ఉభయ జిల్లాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు. సోమవారం ఊహించినంతగా భారీవర్షం పడకపోవడంతో కాసింత ఊరట కలిగింది. మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండడంతో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీ శాఖలు అప్రమత్తమయ్యాయి.
పెరిగిన ఔట్ఫ్లో, తగ్గిన ఇన్ఫ్లో..
భారీ వర్షపాతం అంచనాల నేపథ్యంలో చరిత్రలో తొలిసారిగా తక్కువ నీటి నిల్వ ఉన్న సమయంలో ఎస్సారెస్పీ 9 వరద గేట్లను ఎత్తివేసి దిగువకు 25వేల క్యూసెక్కులను వదిలారు. ఈ ప్రవాహం సోమవారం ఉదయం వరకు కొనసాగింది. మహారాష్ట్రలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో ఇరిగేషన్ అధికారుల ఆదేశాలతో ఎస్సారెస్పీ ఇంజినీర్లు 15 వరద గేట్లను ఎత్తి దిగువకు 50వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని గోదావరి నదిలోకి వదిలారు. ఇక వరద కాలువ ద్వారా మిడ్ మానేరు ప్రాజెక్టుకు 10వేల క్యూసెక్కులు వదులుతుండగా దీనిని రాత్రికి 14వేల క్యూసెక్కులకు పెంచారు. ఇలా ఔట్ఫ్లోను 69,450వేల క్యూసెక్కులతో సమన్వయం చేస్తున్నారు. సోమవారం ఉదయం లక్షా20వేల క్యూసెక్కులు వచ్చిన వరద మధ్యాహ్నానికి కాసింత తగ్గింది. తిరిగి సాయంత్రం 4.30గంటలకు 60,910 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. మొత్తానికి పోచంపాడ్ ప్రాజెక్టులో 76.743 టీఎంసీల నీటి నిల్వ ఉంచుతూ మిగిలిన వరదను దిగువకు వదులుతున్నారు.
వైవిధ్యమైన వాతావరణం..
అల్పపీడన ప్రభావంతో గడిచిన వారం రోజులుగా ఆకాశం ముసురేసింది. దట్టమైన మేఘాలు అతి తక్కువ ఎత్తులో ముందుకు కదులుతుండడంతో ఆహ్లాదకరమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఇదిలా ఉండగా ఆది, సోమవారాల్లో ఊహించినంతగా వర్షాలు కురవలేదు.