కంఠేశ్వర్/కామారెడ్డి, జూన్ 29: ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు పోటెత్తాయి. నిజామాబాద్లో 122, కామారెడ్డిలో 101 వినతలు వచ్చాయి. నిజామాబాద్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో మండల ప్రత్యేకాధికారులు, మండల విద్యాధికారులు క్షేత్రస్థాయిలో విధిగా సందర్శిస్తూ సౌకర్యాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయన్న పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వీ గిరి, జడ్పీ సీఈవో చందర్, అధికారులు పాల్గొన్నారు.