కమ్మర్పల్లి, జనవరి 2: మండల కేంద్రం లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ప్రొటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకోగా.. బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు వెంటనే ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయించి సభను కొనసాగించారు. కమ్మర్పల్లిలో ప్రజాపాలన గ్రామసభ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఫొటో లేకపోవడంతో ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ నాయకుడు లోలపు సుమన్, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు ఏర్పాటు చేయాలని, వారి ఫొటోలు ఏర్పాటు చేసిన తర్వాతే సభ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో స్థానిక అధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించి, సభలో వ్యక్తమైన అభ్యంతరాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
‘ప్రజాపాలన’లో నిర్లక్ష్యం..
రెంజల్, జనవరి 2: రెంజల్ ఎంపీడీవో శంకర్, సాటాపూర్ గ్రామ కార్యదర్శి మహిబూబ్ అలీకి అధికారులు మెమో జారీ చేశారు. ఈ మేరకు జడ్పీ సీఈవో గోవింద్నాయక్, డీపీవో జయసుధ వేర్వేరుగా ఉత్వర్వులు జారీ చేశారు. సాటాపూర్ గ్రామంలో డిసెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం గ్రామ సభలో ఆరు గ్యారెంటీలపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడం, దరఖాస్తు ఫారాలను అందించడంలో జాప్యం జరిగింది. ఇందుకు వారిని బాధ్యులను చేస్తూ అధికారులు మెమోలు జారీచేశారు.