Rs.1 Lakh aid for BCs | నిజామాబాద్, జూన్8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కుల, చేతి వృత్తిదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.లక్ష ఆర్థికసాయం పథకం నేటి నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. దశాబ్ది వేడుకల్లోనే బీసీలకు ఈ పథకాన్ని అందించాలని సీఎం ఇదివరకే నిర్ణయించిన నేపథ్యంలో పథకం ప్రారంభం కానున్నది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం జిల్లా మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల జాబితాను అధికారులు వెల్లడిస్తారు. రూ.లక్ష సాయానికి గతంలో రూ.50వేలు పొందిన వారు అనర్హులు. అలాగే గడిచిన ఐదేండ్లలో ప్రభుత్వం ద్వారా సాయం పొందిన వారికి సైతం ఈ పథకం వర్తించదు. పూర్తిగా చేతి వృత్తి, కుల వృత్తి ఆధారంగా చేసుకుని బతుకుతున్న వారికి ప్రభుత్వం రూ.లక్ష అందిస్తోంది. అత్యంత పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ. లక్ష సాయానికి ఎంపికైన వారికి బ్యాంక్ అకౌంట్లోనే నగదును జమ చేస్తారు. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఎవరెవరు అర్హులు..
ప్రభుత్వం తాజాగా బీసీలకు అందించబోత్నున రూ.లక్ష ఆర్థికసాయం పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని సబ్ కమిటీ నిర్ణయించిన నియమ, నిబంధనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే బీసీ కులాల్లో చేతి, కుల వృత్తిదారులై ఉండాలి. లబ్ధిదారుని వయస్సు జూన్ 2 నాటికి 18 ఏండ్లు దాటి ఉండాలి. 55 ఏండ్లు మించకూడదు. ప్రభుత్వ సాయాన్ని కేవలం పని పరికరాలు, ముడిసరుకు కొనుగోలు కోసం మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపూ ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆర్థిక సాయం అందించనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గడిచిన ఐదేండ్ల కాలంలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా లబ్ధి పొందని వారికే రూ.లక్ష అందుతుంది. నిధుల దుర్వినియోగంతో పాటుగా వృథా కావొద్దనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను ప్రభుత్వం పెట్టింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 6వ తేదీ నుంచే ప్రారంభమైంది. tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ను ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించారు.
లబ్ధిదారుని అకౌంట్లో జమ…
బీసీలకు అందించబోతున్న రూ.లక్ష సొమ్మును ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టబోతుంది. దళారులు, మధ్యవర్తులకు ఎలాంటి స్థానం లేకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంది. పథకానికి ఎంపికైన లబ్ధిదారుని అకౌంట్లోనే నేరుగా రూ.లక్ష మొత్తాన్ని జమ చేస్తారు. రేషన్ కార్డు, కుల, ఆదాయం ధ్రువీకరణ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్ పోర్టు సైజ్ ఫొటోతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు మండలాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి దరఖాస్తులను పరిశీలిస్తారు. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీ అర్హులను గుర్తించి జాబితాను సిద్ధం చేసి మంత్రి ఆమోదానికి నివేదిస్తుంది. ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ప్రకటించి రూ.లక్ష సాయాన్ని అందిస్తారు. ఆర్థిక సాయం పొందిన నెలలోగా ఆ నిధులతో పని పరికరాలు, ముడి సరుకు లబ్ధిదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎంపీడీవోలు క్షేత్ర స్థాయిలో యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కులవృత్తిదారులకు, చేతి వృత్తుదారులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్ష్యం.
నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది ఎంపిక…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పథకం ప్రారంభం రోజున నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రూ.లక్ష పథకాన్ని అందించబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో నుంచి అర్హులను గుర్తించి వారి బ్యాంక్ అకౌంట్లో రూ.లక్ష జమ చేయబోతున్నారు. నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది వరకు తొలుత గుర్తించి వారికి సాయం అందించేందుకు బీసీ అభివృద్ధి శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో 50 నుంచి 90 మంది లబ్ధిదారులకు రూ.లక్ష సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 3వేల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఎంపిక…
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ నెల 9న పథకం లాంఛనంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రాథమికంగా ప్రతి నియోజకవర్గంలో కొంత మంది అర్హులను గుర్తిస్తున్నాం. జూన్ 20 వరకు అర్హులైన వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసిన అనంతరం రూ.లక్ష సాయాన్ని అందిస్తాం.
శ్రీనివాస్, బీసీ అభివృద్ధి శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా