ఖలీల్వాడి, మే 1 : నిజామాబాద్ జిల్లాలో బోదకాలు సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే వైద్య సేవలను మెరుగుపర్చారు. దీంతోపాటు ఏటా సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వ్యాధినీ నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఇంటింటా సర్వే చేపడుతున్నారు. వ్యాధుల వ్యాప్తిని ముందుగానే గుర్తించి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.
విజయవంతంగా పైలేరియా నివారణ..
నిజామాబాద్ జిల్లాలో వైద్యారోగ్య సిబ్బంది విజయవంతంగా సర్వేలు నిర్వహించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. మొన్నటికి మొన్న మలేరియా నివారణలో జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడమే ఇందుకు నిదర్శనం. బోదకాలు వ్యాధి నివారణపై కూడా ఇంటింటా సర్వే నిర్వహించి నిజామాబాద్ జిల్లా వైద్యాధికారులు మంచి ఫలితాలను రాబట్టారు. జిల్లావ్యాప్తంగా టాస్-3 (ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే) ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా విజయం సాధించారు.
అత్యాధునిక పద్ధతుల్లో సర్వే..
పైలేరియా నివారణకు అత్యాధునిక పద్ధతుల్లో సర్వే చేస్తున్నారు. ర్యాపిడ్ కిట్లని ఉపయోగించి కేవలం పది నిమిషాల్లోనే వ్యాధిని నిర్ధారిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 57 పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 1, 2,6,7 తరగతుల వయస్సు ఉన్న 1725 మంది పిల్లలకు టెస్టులు చేశారు. వీరిలో ఐదుగురికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. బోదకాలు లక్షణాలు శరీరంలో ఉన్నప్పటికీ ఈ వ్యాధి బయటపడడానికి 15 నుంచి 20 ఏండ్లు పట్టే అవకాశం ఉంటుంది.
ఎండీఏ ద్వారా సత్ఫలితాలు..
జిల్లాలో 2005 నుంచి 2015 వరకు పది దశలుగా ఏటా ఎండీఏ (మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా దోమలు, పైలేరియా నివారణపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రక్త నమూనాలు సేకరించి టెస్టులు చేశారు. రెండేండ్ల వయస్సు ఉన్నవారికి డీఈసీ, అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వచ్చినట్లు తాజా సర్వేల ద్వారా అధికారులు గుర్తించారు. సర్వేలో కనీసం 20 మందికి పాజిటివ్ వస్తే ఎండీఏ కార్యక్రమాన్ని తిరిగి అమలు చేస్తారు. కానీ జిల్లాలో బోధకాలు బాధితుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఈ సారి సర్వే అవసరం లేదని వైద్యాధికారులు వెల్లడించారు.
వైద్యసిబ్బంది కృషి అభినందనీయం..
బోదకాలు వ్యాధి నివారణలో వైద్య సిబ్బంది కృషి అభినందనీయం. ప్రభుత్వం సూచనల మేరకు సర్వేలను విజయవతంగా పూర్తిచేశాం. అధికారులు, సిబ్బంది కష్టానికి ఫలితం దక్కింది. ప్రజలకు అవగాహన కల్పించి మందులు పంపిణీ చేయడం ద్వారా జిల్లాలో పైలేరియా తీవ్రత పూర్తిగా తగ్గింది. కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయి.
-తుకారాం రాథోడ్, పైలేరియా నివారణ అధికారి, నిజామాబాద్ జిల్లా