కోటగిరి, ఫిబ్రవరి 20: టమాట ధర అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటివరకూ బాగా పలికిన ధర ఇప్పుడు తగ్గిపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో టమాట తెంపకుండానే చేనులోనే వదిలేస్తున్నారు. కోటగిరి మండలంలో నీటి వసతి అంతంత మాత్రమే ఉన్న చోట రైతులు కూరగాయల సాగుపై ఎక్కువ దృష్టి సారించారు. ఇందులో అధిక మొత్తంలో టమాట సాగు చేశారు.
అయితే, ఒక్కసారిగా టమాట ధర పడిపోవడంతో పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. కనీసం పంట తరిలించే రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో చేనులోనే వదిలేస్తున్నామని తెలిపారు. 20 రోజుల క్రితం మార్కెట్లో కిలో రూ.30 ధర పలుకగా, పండించిన రైతుకు రూ.20 వచ్చేది. కానీ ప్రస్తుతం మార్కెట్లో హోల్సేల్గా కిలో రూ.2 కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.