డిచ్పల్లి/ సిరికొండ, ఆగస్టు 27: ఉద్యాన పంటలను సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా మేలు చేకూర్చనున్నది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను ప్రకటించింది. మూడేండ్ల పాటు నిర్వహణ ఖర్చులను భరిస్తూ సాగు రైతులకు బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందించనున్నది. జోరుగా వర్షాలు కురవడం.. నీటి వనరులు సమృద్ధిగా ఉండడం.. వరి పంటకు బదులుగా పండ్లు, కూరగాయల తోటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు లేకపోవడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాం టి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఉపాధి హామీ పథకంతో ఉద్యానశాఖను అనుసంధానం చేస్తూ రైతులను ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించింది.
జిల్లాలో ఈ పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. పండ్లు, కూరగాయల తోటల సాగుతో రైతులు ఆశించిన లాభాలు పొందాలన్నదే ప్రభుత్వ ఆశయం. పండ్ల తోటల సాగు చేపట్టాలనుకున్న రైతులు అధికారులను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.
-సంధ్యారాణి, క్లస్టర్ లెవల్ హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారిణి
నిజామాబాద్ జిల్లాలో 3300 ఎకరాల్లో వివిధ పండ్ల తోటల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, మునగ, జీడి మామిడి, సపోటా, బత్తాయి, పనస, నేరేడు, ఆపిల్ బేర్, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, సీతాఫలం మొదలైన పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించనున్నది.