నిజాంసాగర్, ఏప్రిల్ 20: జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకూ ముందుకు రాలేదని, ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
కొనుగోలు చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి సముదాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి జొన్నలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాకు భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మద్దతు పలికి పాల్గొన్నారు.