కోటగిరి, ఏప్రిల్ 5: రాష్ట్ర ప్రభుత్వం పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని హెగ్డోలి, కొల్లూర్, యాద్గార్పూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేయని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం వారు మండలంలోని హెగ్డోలి సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి కోటగిరి మండలంలో సుమారు 15 వందల నుంచి రెండు వేల ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటను సాగుచేశామని తెలిపారు. దాదాపు 20 వేల క్వింటాళ్ల వరకు పంట పండినట్లు చెప్పారు.
హెగ్డోలిలో మార్చి 15న మార్క్ఫెడ్ ద్వారా పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతి మేరకు 1400 క్వింటాళ్లు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇంకా రాకపోవడంతో కొనుగోళ్లను పది రోజుల క్రితమే మూసివేశారని వాపోయారు. గోనె సంచుల కొరత కూడా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం వరకు కొనుగోలు చేయకుంటే మంగళవారం పొతంగల్ చెక్పోస్టు వద్ద ఆందోళన చేస్తామని రైతులు స్పష్టం చేశారు.
పంటను అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి వస్తే ఇక్కడ గన్నీ బ్యాగులు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పంటను కొనుగోలు చేయాలి. వర్షాలు కురిస్తే పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
– గంగారాం,రైతు హెగ్డోలి, పొతంగల్ మండల
యాద్గార్పూర్లో తొమ్మిది ఎకరాల్లో సన్ఫ్లవర్ పంటను పండించిన. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని హెగ్డోలి కొనుగోలు కేంద్రంలో మా పంటను కొనుగోలు చేయడం లేదు. అక్కడ కాంటాను నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.
-షేక్ హైమద్, రైతు, యాద్గార్పూర్
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హెగ్డోలిలో పొద్దు తిరుగుడు పంట కొనుగోలుకు వెంటనే అనుమతి ఇవ్వాలి. కొనుగోలు కేంద్రం మూసివేసి పది రోజులవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలేదు. గన్నీ బ్యాగులు కూడా లేవు. చివరకు కుప్పలు పోసి 15 రోజులు గడుస్తున్నా అలాగే ఉన్నాయి.
– రాజు, రైతు హెగ్డోలి, పొతంగల్ మండలం
ప్రభుత్వం నుంచి ఇంకా తమకు ఎలాంటి అనుమతి రాలేదని పది రోజుల క్రితమే కొనుగోళ్లను నిలిపివేశారు. 211 మంది రైతులు ఉంటే కేవలం 39 మంది రైతుల నుంచి1400 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి కేంద్రాన్ని మూసేశారు. మిగతా రైతులు ఎక్కడికి పోవాలి. నేను 15 ఎకరాల్లో పంటను పండించిన. – విశ్వనాథ్, రైతు హెగ్డోలి, పొతంగల్ మండలం