ధర్పల్లి, ఏప్రిల్ 4 : యాసంగిలో ఆరుతడి పంటలు పండించిన రైతులకు సిరుల వర్షం కురుస్తున్నది. అన్నదాతలు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడం.. చెరువులు, కుంటలు, కాలువల్లో పుష్కలంగా నీరుండడంతో యాసంగిలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత సీజన్ కన్నా 43 వేల ఎకరాల్లో పంటలు అధికంగా సాగయ్యాయి. ఇందులో ఆరుతడి పంటలైన మక్కజొన జొన్న, శనగ పంటల సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే భారీగానే పెరిగింది.
ప్రభుత్వం రైతులను ప్రతి వానకాలం, యాసంగి సీజన్లలో మొత్తానికి మొత్తం వరి పంటనే వేయకుండా ఇతరత్రా వాణిజ్య, ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నది. అయితే కొంతమంది రైతులు వ్యవసాయాధికారుల సూచనలను పట్టించుకోకపోగా కొందరు రైతులు మాత్రం ఇతర పంటలు వేసి లాభాలను ఆర్జించారు. దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం యాసంగి పంటలో జొన్న, మక్కజొన్న వేసిన రైతులు వరి పంటకు మించి లాభాలు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జొన్నకు రూ.5వేల మద్దతు ధర
ధర్పల్లి మండలంలోని మైలారం, సల్లగరిగె గ్రామాల్లోని రైతులు సుమారు 200 ఎకరాల మేర జొన్న పంట వేశారు. రైతులు ప్రధానంగా జొన్న విత్తనాలు అందించిన కంపెనీతోనే బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. దిగుబడి సైతం ఎకరాకు సుమారు 30 క్వింటాళ్లకు రావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర సైతం క్వింటా లుకు రూ.5వేలకు పైనే మద్దతు ధర చెల్లించి విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ లెక్కన వరి పంటతో పోలిస్తే ఎంతో మేలని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మక్కజొన్నకు రూ.2,200 మద్దతు ధర
ఈ యాసంగి పంటలో వరికి బదులు మక్కజొన్న పంటలు వేసిన రైతులు సైతం అధిక లాభాలను ఆర్జించారు. మండలంలో సుమారు 350 ఎకరాల మేర మక్కజొన్న పంటను వేయగా ప్రభుత్వం ప్రకటించిన రూ.1960ల మద్దతు ధర కన్నా ఎక్కువగానే వెచ్చించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మక్కజొన్నకు మొదట రూ.2,100 నుంచి రూ.2,200 వరకు కూడా క్వింటాలుకు మద్దతు ధరను చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో వరికి బదులు మక్కజొన్న పంట వేసినందుకు దిగుబడి బాగా వచ్చి మద్దతు ధర సైతం బాగా రావడంతో ఖర్చులు పోను నాలుగు రాళ్లు మిగిలాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆదర్శంగా నిలుస్తున్న ధర్పల్లి రైతులు
ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఈ యాసంగిలో ధర్పల్లి మండలంలో 350 ఎకరాల్లో మక్కజొన్న, 200 ఎకరాల్లో జొన్న పంటను రైతులు సాగు చేశారు. అయితే పంట దిగుబడి సైతం బాగా వచ్చి పంటకు ఆశించిన దాని కన్నా ఎక్కువగానే మార్కెట్లో మద్దతు ధర లభించడంతో రైతులకు అధిక లాభాలు వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రైతులు వరి పంటపైనే ఆధారపడకుండా ఆరుతడి, వాణిజ్య పంటలు వేసి అధిక లాభాలు గడించవచ్చని మక్కజొన్న, జొన్న వేసిన రైతులు నిరూపించారు.
జొన్న పంటతో అధిక లాభాలు
యాసంగిలో నీటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న పంటను వేశాను. ఎకరం 12 గుంటల భూమిలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ కంపెనీతో బైబ్యాక్ ఒప్పందం కింద విత్తనాలు కొనుగోలు చేసి పంట వేశాను. మొత్తంగా 38.40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.5 వేల పైచిలుకు చెల్లించి కంపెనీ ప్రతినిధులు పంటను కొనుగోలు చేశారు. దీంతో ఈ సంవత్సరం జొన్న పంటను వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విషయాన్ని ఇతర రైతులకు సైతం తెలియజేస్తున్నాను.
– ధర్మయ్యగారి రాజేందర్రెడ్డి, సొసైటీ చైర్మన్, రైతు, మైలారం గ్రామం
ఈ సారి దిగుబడి బాగానే వచ్చింది
ఈ యాసంగిలో మక్కజొన్నపంటను వేసినందుకు దిగుబడి బాగానే వచ్చింది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖర్చులు పోను నాలుగు పైసల్ చూడగలుగుతున్నాం. క్వింటాలుకు రూ.2,060 చెల్లించి కొనుగోలు చేశారు. మా కన్నా ముందు ఇతరులకు రూ.2,200/-లకు క్వింటాలుకు చెల్లించారు. అయితే ఈ సంవత్సరం మక్కజొన్న వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దిగుబడులు, లాభాలు బాగానే వచ్చాయి.
– పిండి రాజన్న, రైతు, ధర్పల్లి గ్రామం