కమ్మర్పల్లి, జూలై 11 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వర జలసిరి ప్రవహిస్తున్నది. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు గంగమ్మ ప్రాజెక్టులోకి బిరబిర వస్తున్నది. జలసిరులను సందర్శనకు వచ్చిన రైతులు చూసి మురిసిపోతున్నారు. మంగళవారం బాల్కొండ నియోజక వర్గం కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్, కమ్మర్పల్లి గ్రామాల రైతులు ఆరు బస్సులు, కార్లలో కాళేశ్వర జల సందర్శనకు ముప్కాల్ పంప్హౌస్ వద్దకు వచ్చారు. కాళేశ్వరం జలాలు పంప్హౌస్ నుంచి నాలుగు పంపుల ద్వారా భారీగా అప్రోచ్ కాలువలోకి దూకే దృశ్యాన్ని చూసి సంబుర పడ్డారు. అక్కడి నుంచి అప్రోచ్ కాలువలో పరవళ్లు తొక్కుతూ ఎస్సారెస్పీ తీరంలోకి చేరుతున్న జలాలను చూస్తూ పులకరించి పోయారు. అక్కడి నుంచి కాళేశ్వర జలాలు కాలువగా దిగువన పావు కిలోమీటర్ ప్రవహిస్తుంది. ఆ దారి వెంట ఒడ్డున నడుస్తూ కాళేశ్వర జలాలను తనివితీరా తిలకించారు. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందకర సందర్భాలను శాశ్వత పర్చుకున్నారు. కాళేశ్వర జలాలను తెచ్చి రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని చల్లగా చూడాలని కోరుకున్నారు. సందర్శనకు వచ్చిన రైతులకు అధికారులు కాళేశ్వరం నుంచి జలాలు వరదకాలువలో ఎగువకు ప్రవహిస్తూ శ్రీరాంసాగర్కు చేరుకునే ప్రక్రియను వివరించారు. అనంతరం ముప్కాల్ పంప్హౌస్ భారీ మోటర్లు, మిషన్ల నిర్వహణ కార్యాలయాలను సందర్శించారు. సందర్శనకు వచ్చిన రైతులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఖర్చుతో భోజనాలు పెట్టించారు.
ఉప్పొంగిన అభిమానం…
ఎస్సారెస్పీలో కాళేశ్వరం జలాలను చూసిన రైతుల్లో సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై అభిమానం ఉప్పొంగింది. ఎక్కడి కాళేశ్వరం ఎక్కడి నీళ్లు ఇంత దూరం రావడం అంటే మాటలా ఇది సీఎం కేసీఆర్, ప్రశాంత్ రెడ్డితోనే సాధ్యమైందని ఒకరికొకరు చెప్పుకోవడం కనిపించింది. కాళేశ్వరం జలాలను మహిళలు దోసిళ్లలో పట్టుకుని మురిసిపోతూ ఇవి కేసీఆర్ నీళ్లు, ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన నీళ్లు అంటూ సంబురపడ్డారు. వర్షాకాలం మొదలై నెల రోజులు దాటినా వాన నీళ్లు మనకు కనిపించలేదు. కానీ ఎక్కడో ఉన్న కాళేశ్వరం నీటిని మాత్రం మన ఎస్సారెస్పీకి తెచ్చిన మన సీఎం, మన మంత్రి మళ్లీమళ్లీ వారే రావాలని కోరుకుందామంటూ ముచ్చటించు కున్నారు.
నీళ్లను చూస్తే చాలా సంతోషంగా ఉంది
కాళేశ్వరం జలాలను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో ఉన్న నీళ్లను ఎదురు తేవడం అంటే మాములు మాట కాదు. నిజంగా సీఎం కేసీఆర్,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి ఎంతగానో ఉంది. వర్షాకాలంలో వర్షాలు పడకపోయినా కాళేశ్వరం నీటితో పోచంపాడ్ డ్యాంను నింపుకోవచ్చు.
-సామ అనూష, హాసాకొత్తూర్, కమ్మర్పల్లి మండలం
ప్రపంచలోనే అద్భుతం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే చాలా అద్భుతమైనది. ఎలాగైన చూడాలని అనుకున్నాం. సీఎం కేసీఆర్ ,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో ఎక్కడి నుంచో వచ్చే నీళ్లను మా దగ్గరికి రావడం చాలా అరుదైన విషయం. రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లను ఎదురెక్కించడం అనేది చాలా అద్భుతం. భావితరాలకు భరోసా కల్పించిన కేసీఆర్కు, మంత్రి వేములకు ధన్యవాదాలు.
-తీగల అఖిల, ఎమ్మెస్సీ, కమ్మర్పల్లి
రైతు కష్టమెరిగిన ఖద్దరు ఇంజినీర్
రైతు కుటుంబంలో పుట్టి రైతుల కష్టాలను ఎరిగిన రైతు బిడ్డ కష్టమెరిగిన ఖద్దరు ఇంజినీర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రైతుల అవసరాలు గుర్తించి సాగు నీటిని దిగువ నుంచి ఎగువకు తీసుకురావడం సీఎం కేసీఆర్ , ప్రశాంత్ సార్ తోనే సాధ్యమైంది. ఇప్పుడు వర్షాలు లేవని బాధపడకుండా కాళేశ్వరం జలాలతో గుండె నిండా ధైర్యంతో పంటలు వేయవచ్చు.
-రెంజర్ల రమ్య, బీటెక్ విద్యార్థిని, కమ్మర్పల్లి
ఎవుసం కష్టం తీర్చిండ్రు
ఎవుసంలో పెద్ద కష్టం అన్నది నీళ్ల్లు లేకుంటేనే వస్తది. పంటకు నీళ్లు సాలకపోతే తుట్టి అస్తది. గా నీళ్లనే కాళేశ్వరం కెల్లి తెచ్చి అందిస్తున్నరు. ఈ నీళ్లతోని ఎవుసంలో కష్టం తీరుతది. పోచంపాడ్ డ్యాంలో ఒక ఎడాది నీళ్లు ఉంటే అచ్చే యాడాది నీళ్లు ఉంటలేవని 20 ఏండ్ల సంది అంటున్నరు. కానీ సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ల లెక్క బయటకెళ్లి నీళ్లు తెచ్చి నింపుతమని మునుపటోల్లు ఆలోచించక పోయిరి..
-గడ్డం నాగవ్వ
పోచంపాడ్కు జీవం పోసిండ్రు
వరద కాలువతో కాళేశ్వరం నీళ్లను ఎదురు తెచ్చి పోచంపాడ్ డ్యాంలో నింపుతున్నారు. అసలు నీళ్లు రివర్స్ రావడం అనేది ఎన్నడూ వినలేదు. ముప్కాల్ పంప్ హౌస్ నుంచి నాలుగు మోటర్లతో పోచంపాడ్ డ్యామ్లోకి నీళ్లను వదులుతున్నారు. ఇక్కడికి వచ్చి చూసిన రైతులందరం చాలా అనందంగా ఉన్నాం. కాళేశ్వరం నీళ్లు తెచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి గొప్పతనం మరిచిపోం.
-ఆమని, కమ్మర్పల్లి
రైతుకు భోరోసా కల్పిచిండ్రు
కేసీఆర్ సార్ పోచంపాడ్ను కాళేశ్వరం నీళ్లతో నింపుతూ రైతులకు భరోసా కల్పించిండ్రు. ఎగువ నుంచి వస్తే మాత్రమే డ్యాం నిండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ ఇద్దరి చొరవతో శ్రీరాం సాగర్ డ్యాం నిండుకుండలా మారనుంది.
-ఇట్టెడి మమత, హాసాకొత్తూర్, కమ్మర్పల్లి మండలం
కాళేశ్వర జలాలు రావడం అనందం
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్లోకి రావడం ఆనందంగా ఉంది. రైతుల మేలు కోరి వరద కాలువతో రివర్స్ తెచ్చిన నీటిని ముప్కాల్ పంప్హౌస్ నుంచి డ్యాంలో నింపుతుండడం చూసి చాలా సంతోషించాం. ఇంతటి మహాభాగ్యం కల్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు.
-జి.లత కమ్మర్పల్లి
పంటలు యేసుకునేటందుకు నీళ్లను తెచ్చిండ్రు
ఆనకాలం అచ్చినా గట్టి ఆనలు పడుతలేవు. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి సార్లు కాళేశ్వరం నీళ్లను బాగా దూరం నుంచి వరద కాలువ పొంటి తెచ్చిండ్రు. పోచంపాడ్ డ్యాంల నింపుతున్నట్లు తెలిసి సూద్దామని అచ్చినం. డ్యాంలకు పోతున్న నీళ్లను జూస్తే మస్తు సంతోషమైతుంది.
-లింగారెడ్డి, హాసాకొత్తూర్, కమ్మర్పల్లి
చరిత్రలో ఇదొక అద్భుతం
కాళేశ్వరం జలాలను పైకి తీసుకురావడం చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టంగా నిలుస్తుంది. వరదకాలువ నిర్మించే విషయంలో జాప్యం జరగడం, నిర్మించిన తరువాత నీళ్లు సరిగ్గా లేకపోవడం ఇలాంటి ఎన్నో సందర్భాలను చూశాం. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో వరదకాలువ దశ మారింది. నిత్యం వరదకాలువ నిండుకుండలా ఉండడంతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. –
-పార్శపు చిన్నబాపయ్య, రైతు కమ్మర్పల్లి
నీళ్లకు ఇబ్బంది లేదు
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పంటలకు నీళ్లందించడంలో ఇబ్బందులు లేవు. ఏదో రకంగా పంటలకు నీళ్లచ్చేటట్లు చేస్తున్నరు. వరదకాలువ ఫుల్గా ఉంటుంది. ఎత్తిపోతలతో చెరువులు నింపుతుండ్రు. ఎండాకాలం వచ్చిందంటే పంటలు వేయాలంటే భయపడేటోళ్లం, కానీ ఇప్పుడు ఎప్పుడు పంటలు వేయాలన్నా భయపడాల్సిన అవసరం లేదన్న భరోసాను కల్పించిండ్రు.
– భీమన్న, రైతు హాసాకొత్తూర్