కామారెడ్డి, జూన్ 22 : రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా అందక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యూరియా యాప్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం అష్టకష్టాలు పడినా దొరక్కపోవడంతో విసిగివేసారిన ఓ రైతు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. యూరియా దొరకడంలేదంటూ రాజంపేట సొసైటీ వద్ద రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. రోజుల తరబడి క్యూలో నిల్చున్నా ఎరువులు అందకపోవడం, యాప్ విధానంపై అవగాహన లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన కుమ్మరి వెంకట్ అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. వెంటనే గమనించిన పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు.
సదరు రైతు చేతిలో నుంచి పెట్రోల్ ఉన్న బాటిల్ను పోలీసులు లాక్కున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాప్ విధానంతో ఉదయం నుంచి ఎదురుచూసినా క్షణాల్లో స్టాక్ ఖాళీ అవుతున్నదని, సకాలంలో ఎరువులు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ జానకి, పోలీసులు, అధికారులు సొసైటీకి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి రైతుకూ యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మంగళవారం ఉదయం యూరియా పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.