పిట్లం, మే 20: జొన్నల కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రాంపూర్(కలాన్) గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఎకరానికి కేవలం 10 క్వింటాళ్ల జొన్నలు మాత్రమే కొనాలంటూ తెచ్చిన జీవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పది క్వింటాళ్లకు బదులుగా తక్షణమే 20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ..
రైతులు వేల రూపాయల పెట్టుబడి పెట్టి, ఎంతో కష్టపడి జొన్న పంటను పండించారని, తీరా మార్కెట్ యార్డుకు తెచ్చిన తర్వాత కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మిగిలిన పంటను మళ్లీ వెనక్కి తీసుకెళ్లడానికి రవాణా ఖర్చులు భారమవుతాయని, దీంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పది క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని జారీ చేసిన జీవో స్థానంలో 20 క్వింటాళ్లు కొంటామని వెంటనే కొత్త జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మందడి నారాయణ రెడ్డి, ఏఎంఎసీ మాజీ డైరెక్టర్ రాజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.