వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవసాయ శాఖ తేల్చింది. ఉమ్మడి జిల్లాలో పంట సాగు విస్తీర్ణంలో దాదాపు 82 శాతం వరి వేసే అవకాశముందని అంచనా వేసింది. అలాగే, మక్కజొన్న, సోయా, పత్తి, అపరాలపైనా రైతాంగం దృష్టి సారించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వానకాలం సాగు ప్రణాళిక ఖరారు చేసింది. నిజామాబాద్ జిల్లాలో 5.12 లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 5.40 లక్షల ఎకరాల్లో పంటలు సాయ్యే అవకాశముంది. దీంతో అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. కాలం బాగానే ఉంటుందన్న వాతావరణ శాఖ ప్రకటనలతో రైతులు ఉత్సాహంగా సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బోధన్, బాన్సువాడ ప్రాంతాల్లో నార్లు పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్, మే 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానాకాలం సీజన్కు సమయం ఆసన్నం అవుతుండడంతో రైతులంతా ముందస్తు పనుల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే యాసంగి ధాన్యం అమ్మకాలను పూర్తి చేయడంతో మళ్లీ సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు ధాన్యం సేకరణ ప్రక్రియ చివరికి చేరుకున్నది. దీంతో బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, జుక్కల్ ప్రాంతాల్లో సాగుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ సైతం సాగు అంచనాలను సిద్ధం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 5.12లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని పేర్కొనగా ఇందులో అగ్రభాగం వరికే రైతులు మొగ్గు చూపుతున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ గతం మాదిరిగానే వరి, మక్కజొన్న, పత్తి పంటల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లోనే సాగు అంచనాలను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వానకాలం సీజన్లో వరి సాగుకే రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కాలం కలిసి వస్తే దిగుబడులు భారీగా రావడంతో పాటు తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం మొత్తం సాగులో సగభాగం సన్న రకం సాగుకు రైతులు మొగ్గు చూపుతుండడం వరి సాగు పెరగడానికి కారణంగా నిలుస్తున్నది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం సాగు విస్తీర్ణంలో అగ్రభాగం వరి పంటకే రైతులు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ శాఖ వెల్లడించిన అంచనాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 82 శాతం మేర వరినే సాగు చేయబోతున్నట్లుగా తేల్చారు. వానకాలం సీజన్కు సంబంధించి సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేయగా ఇందులో మొత్తం పంటల విస్తీర్ణం 5లక్షల 12వేల 356 ఎకరాల్లో ఉంది. ఇందులో అత్యధికంగా 4లక్షల 17వేల 943 ఎకరాల్లో వరి ఉండొచ్చని భావిస్తున్నారు. మక్కజొన్న 32,185 ఎకరాలు, సోయా 56,715, పత్తి 1803, కంది 1883, పెసర 151, మినుము 125, వేరు శనగ 204, ఇతర పంటలు 347 ఎకరాల్లో సాగవుతాయని అంచనా. అంచనాల మేరకు వరి విత్తనాలు లక్షా 25వేల క్వింటాళ్లు, మక్కజొన్న 2,500, పెసర 12, కంది 75, మినుపు 10, సోయాబీన్ 17,615, పత్తి 3600, జీలుగ 20 వేలు, జనుము 500 క్వింటాళ్ల చొప్పున రైతులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. పంట మార్పిడికి ఆసక్తి చూపుతున్న రైతులను వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తున్నది. స్వచ్ఛందంగా ఇతర పంటల వైపు దృష్టి పెట్టే వారందరికీ అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ వానకాలం పంటల సాగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఒకట్రెండు రోజుల్లో ప్రణాళికను ఖరారు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎప్పటి లాగే ప్రధాన పంటగా వరినే అత్యధిక మంది రైతులు సాగు చేయబోతున్నట్లుగా అంచనాలు సిద్ధం అయ్యాయి. వరి తర్వాత అధిక మొత్తంలో సోయా, పత్తి, మక్కజొన్న పంటలతో పాటు అపరాల సాగు విస్తీర్ణంలో కాసింత పెరుగుదల కనిపించనున్నట్లుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వచ్చే వానకాలంలో దాదాపు 5.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని చెబుతున్నారు. మొత్తం సాగు విస్తీర్ణంలో ఇందులో అత్యధికంగా వరి పంటను 3లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. మక్కజొన్న 86 వేల ఎకరాలు, పత్తి 73 వేలు, సోయా 72వేలు, కందులు 22వేలు, పెస ర్లు, మినుములు 10వేలు, గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని వ్యవసాయ ప్రాంతాల్లో చెరుకు 4,100 ఎకరాల్లో సాగు కావచ్చని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. సాగు అంచనాలకు తగ్గట్లుగా 60వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 18వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు, 70వేల క్వింటాళ్ల పత్తి ప్యాకెట్లు, మక్కజొన్న 4వేల క్వింటాళ్లు, కందులు వేయి క్వింటాళ్లు, పెసర 1500 క్వింటాళ్లు, మినుములు 800 క్వింటాళ్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సాగు నీటి లభ్యతకు ఢోకా లేదు. పుష్కలంగా వనరులు అందుబాటులో ఉండడంతో అత్యధిక మంది వరికే మొగ్గుచూపుతున్నట్లుగా వ్యవసాయ శాఖ చెబుతున్నది. గతం కన్నా ఈసారి భిన్నమైన పంటల వైపు కొద్ది మంది రైతులు అక్కడక్కడ నూతన పంథాను ఎంచుకుంటున్నారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఎక్కువగా కామారెడ్డిలోనే వరితో పాటు సోయా, పత్తి, మక్కజొన్న, అపరాల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నట్లుగా వ్యవసాయ శాఖ తేల్చింది. ఇక వరిసాగులో సగానికి ఎక్కువ సన్న రకమే ఉండనున్నది. ఇంటి అవసరాలకు పోను బహిరంగ మార్కెట్లోనూ ఎక్కువ డిమాండ్ ఉండడంతో సన్న రకాలను సాగు చేసేందుకే రైతులంతా ఆసక్తి చూపుతున్నారు. గతేడాది వానకాలంలో సన్న రకాలను ప్రైవేటు వ్యక్తులు మద్దతు ధరకు సమానంగా, కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువే చెల్లించి సేకరించడంతో ఈసారి మరింత డిమాండ్ పెరిగినట్లు అయ్యింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 10లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వనున్నాయి. వానకాలం కలిసి వస్తుందనే వాతావరణ శాఖ అంచనాలతో పాటు కాళేశ్వరం పథకంలో భాగంగా ఎత్తిపోతలతో గోదావరి జలాలను నింపుకొనే సౌలభ్యం, కేసీఆర్పై రైతులకు ఉన్న నమ్మకం ముందడుగు వేసేందుకు ప్రేరేపిస్తోంది.
వానకాలం సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో సాగు ప్రణాళికను సిద్ధం చేశాం. వరికే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం. రైతుల సేవలో వ్యవసాయ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులుంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులకు ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు.
– ఆర్.తిరుమల ప్రసాద్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి