ఎల్లారెడ్డి రూరల్, మే 26: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కాంటా చేయడంలేదని, వడ్లను తీసుకెళ్లడానికి లారీలు రావడంలేదని ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని హాజీపూర్ సడాక్ తండా రైతులు మంగళవారం ఎల్లారెడ్డి – కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యం పోసి నిప్పు పెట్టి, రోడ్డుపై ధాన్యం సంచులు పెట్టుకొని ధర్నా చేపట్టారు. లక్ష్మాపూర్ సెంటర్ పరిధిలోని హాజీపూర్ సడాక్ తండాలో సబ్ సెంటర్ కింద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి కనీసం రోజుకు రెండు లారీలు అవసరం కాగా, ఐదు రోజులుగా ఒక్క లారీ కూడా రాకపోవడతో తూకం వేసిన సంచులు అలాగే ఉన్నాయి.
మంగళవారం నుంచి తూకం కూడా నిలిచిపోయింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో హాజీపూర్, హాజీపూర్ సడాక్తండా, జిత్యా తండాకు చెందిన రైతులందరూ ఎల్లారెడ్డి – కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యాన్ని పోసి నిప్పు పెట్టారు. ధాన్యం సంచులను రోడ్డుపై పెట్టుకొని ధర్నాకు దిగారు. లారీలు రాకపోవడంతో తరలించేందుకు రెండు వేల బస్తాల ధాన్యం నిలిచిపోయిందన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో ఆలస్యంగా పంపించడంతో వడ్ల బరువు తగ్గి నష్టపోతున్నామని పేర్కొన్నారు. డ్రైవర్లు లారీల్లో నింపిన ప్రతి సంచికి 5 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు నూకలు వస్తున్నాయనే సాకుతో లోడ్కు 10 నుంచి 20 సంచుల వరకు తరుగు తీస్తున్నారని మండిపడ్డారు.
రైతులను అన్నివిధాలుగా దగా చేస్తున్నారని వాపోయారు. సమాచారం అందుకున్న ఎస్సై, తహసీల్దార్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి రైతులను సముదాయించడంతో వారు తాత్కాలికంగా ధర్నా విరమించారు. రోజుకు మూడు లారీలను పంపిస్తానని, అవి వచ్చేదాకా రోజూ తాను ఇక్కడే కూర్చుంటానని తహసీల్దార్ మాట ఇచ్చారు. ఒకవేళ మాటను నిలబెట్టుకోకపోతే మళ్లీ ధర్నా చేపడుతామని రైతులు హెచ్చరించారు. తమకు న్యాయం జరిగేవరకూ విడిచిపెట్టేది లేదని, ఇంతచేసినా న్యాయం జరుగకపోతే పురుగుల మందు తాగి మూకుమ్మడిగా చచ్చిపోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మస్తు కష్టమైతున్నది..
నాకు రెండెకరాల పొలం ఉన్నది. పొలం కోసి 40 రోజులవుతుంది. కొనుగోలు కేంద్రంలో వడ్లు అలానే ఉన్నాయి. తూకం వేసిందిలేదు.. సంచుల్లో నింపిందిలేదు. లారీలు వచ్చినయి లేవు. ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడూ లేకుండే. ధాన్యం లారీల్లో పోతే ఖాతాల్లో పైసలు పడతాయి. బాకీలు కట్టుకొని మిగతా పైసలు మళ్లీ పంటకు యూరియా, మందులు తెచ్చుకుం దామనుకుంటే లారీలు రాకపోవడంతో మా వడ్లు అట్లనే ఉంటున్నయ్.
-మాలోత్ సూర్యానాయక్, రైతు, హాజీపూర్ కట్టకింది తండా