ఖలీల్వాడి/కామారెడ్డి, ఫిబ్రవరి 16: రైతులు, కార్మికులు కన్నెర్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కార్మిక సంఘాలు చేపట్టిన ‘గ్రామీణ భారత్ బంద్’ విజయవంతమైంది. ఇందులో భాగంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టగా.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ పని 200 రోజులకు పెంచి, రోజుకు ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వే, రక్షణ, విద్యుత్, బ్యాంకులు, ఎల్ఐసీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువులపై జీఎస్టీని రద్దు చేయాలన్నారు. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించాలన్నారు. కామారెడ్డిలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘల నాయకులు సుధాకర్, ఓమయ్య, నూర్జహాన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్వాడి, ఫిబ్రవరి 15: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో డ్రైవర్లు చేపట్టిన బంద్ ఉమ్మడి జిల్లాలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఆటో మోటర్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గఫాల్, పట్టణ అధ్యక్షుడు సాయిలు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జాఫర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.