నిజామాబాద్ నగర పాలక సంస్థలో చెత్త సేకరించే వాహనాలకు సుస్తీ చేసింది. నగర సుందరీకరణలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు విలువ చేసే అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేశారు. అందులో రోడ్ క్లీనర్, ఫాగింగ్ మిషన్లు, ట్రాక్టర్లు, చెత్త సేకరించే ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా అప్పటి ప్రభుత్వం కేటాయించిన వాహనాలపై అధికారులు నిర్లక్ష్యం చూపడంతోపాటు వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో మూలనపడుతున్నాయి. చిన్నపాటి మరమ్మతులు సైతం చేయించకుండా చెత్తలోనే పారవేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వాహనాలు పిచ్చిమొక్కల మధ్య పారవేయడంతో ప్రజాధనం వృథా అవుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాహనాలు మూలనపడడంతో పలుచోట్ల పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభావం చూపుతున్నది. మరోవైపు కోటగిరి మండలం పోతంగల్ గ్రామ పంచాయతీలో సైతం చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన రిక్షాలు సైతం చెత్త కుప్పలో దర్శనమిస్తున్నాయి.